లోన్లపై వడ్డీ మాఫీ : పండుగ కానుక

24 Oct, 2020 11:52 IST|Sakshi

వడ్డీపై వడ్డీ మాఫీ తాజా మార్గదర్శకాలు జారీ

పండుగ వేళ రుణ గ్రహీతలకు ఊరట

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా, లౌక్‌డౌన్‌ కాలంలో అమలు చేసిన రుణాల మారటోరియం  సమయంలో మాఫీకి సంబంధించిన కేంద్రం శుభవార్త అందించింది. రుణగ్రహీతలకు పండుగ కానుకగా మారటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ రద్దుకు  సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ ప్రకటించిన మారటోరియం పథకం కింద రూ .2 కోట్ల వరకు రుణాలపై "వీలైనంత త్వరగా" వడ్డీ మినహాయింపును అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన తరువాత ఈ మార్గదర్శకాలు వచ్చాయి.

ఆర్థిక శాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం ఆరు నెలల కాలానికిగాను (మార్చి 1 నుండి ఆగస్టు 31, 2020 వరకు)  2 కోట్ల రూపాయలకు మించని హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, క్రెడిట్ కార్డు రుణాలు, వెహికల్ లోన్స్, ఎంఎస్ఎంఈ రుణాలపై వడ్డీ మీద వడ్డీ మాఫీ అందుబాటులో ఉంటుంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు వడ్డీ డబ్బులను కస్టమర్ల లోన్ అకౌంట్‌లో జమ చేస్తాయి. దీన్ని అనంతరం కేంద్రం నుంచి ఆయా బ్యాంకులు వసూలు చేసుకుంటాయి. రుణగ్రహీత పూర్తిగా లేదా పాక్షికంగా తాత్కాలిక నిషేధాన్ని పొందారా అనే దానితో సంబంధం లేకుండా చక్రవడ్డీకి, సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని చెల్లిస్తుంది. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.6,500 కోట్లు అదనపు భారం పడనుంది.

మరిన్ని వార్తలు