‘మీ ఫ్యామిలీని కాల్చిపడేస్తా.. బీజేపీ మంత్రి బెదిరింపులు’

31 Aug, 2022 15:46 IST|Sakshi

ఆయనో మంత్రి.. పేదలకు సాయం చేయాల్సిందిపోయి వారినే బెదిరించాడు. తాను చెప్పింది వినకుండా ఎక్కువగా మాట్లాడితే మీ కుటుంబాన్ని మొత్తం కాల్చిపడేస్తానని వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. హోస్పెట్‌లో భూవివాదానికి సంబంధించి ఎస్సీ వర్గానికి చెందిన ఓ కుటుంబాన్ని కర్నాటక పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆనంద్‌ సింగ్‌ బెదిరించారు. కాగా, మంత్రి మంగళవారం హోస్పెట్‌ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఎస్సీ వర్గానికి చెందిన పోలప్ప అనే వ్యక్తి.. భూవివాదంలో మరో వర్గానికి చెందిన వారు తమను ఇబ్బంది పెడుతున్నారని మంత్రిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూ వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. 

ఈ సందర్భంగా మంత్రి ఆనంద్‌ సింగ్‌.. తాము చెప్పింది చేయాలని పోలప్పను బెదిరించారు. లేకపోతే కుటుంబం మొత్తాన్ని కాల్చిపడేస్తానని వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో ఆవేదనకు గురైన పోలప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు మంత్రి ఆనంద్‌ సింగ్‌తో పాటుగా మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, ఐపిసి సెక్షన్‌ 504, 506 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే, ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో, వారిని అడ్డుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసినందుకు గానూ పోలప్ప ఫ్యామిలీపై కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు