దేశ చర్రితలోనే ఫస్ట్‌.. సీజేఐ ఎన్వీ రమణ వీడ్కోలుకు స్పెషల్‌ గిఫ్ట్‌

26 Aug, 2022 11:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. నేడు(శుక్రవారం) పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక, దేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేశారు. 

సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ బెంచ్‌ ప్రత్యక్ష ప్రసారంలో విచారణలు జరిపింది. కాగా, విచారణలో భాగంగా ఉచిత పథకాలపై దాఖలైన పిటిషిన్లపై సీజేఐ ఎన్వీ రమణ తీర్పు వెల్లడించారు. ఉచిత హామీలపై పిటిషన్లను ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేస్తూ జస్టిస్‌ ఎన్వీ రమణ బెంచ్‌ నిర్ణయం తీసుకుంది. 

ఇదిలా ఉండగా.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా విశేష సేవలు అందించారు. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు.  2021 ఏప్రిల్ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగుతున్నారు. 

కాగా, రేపు 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారంచేయనున్నారు. రాష్ట్రపతి భవన్‍లో జస్టిస్ యూయూ లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇక, యూయూ లలిత్ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. 

మరిన్ని వార్తలు