దూసుకెళ్తున్న ఇండియా వృద్ధిరేటు!

25 Mar, 2021 16:49 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి 2021-22 ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్-2022 మార్చి) అంచనాలను అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం ఫిచ్‌ బుధవారం గణనీయంగా మెరుగు పరచింది. గత 11 శాతం వృద్ధి అంచనాలను 12.8 శాతంగా పేర్కొంది. కరోనా ప్రేరిత సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ ఊహించినకన్నా వేగంగా పురోగమిస్తోందని, తమ అంచనాల మెరుగుకు ఇదే ప్రధాన కారణమనీ వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బేస్‌ ఎఫెక్ట్‌ ప్రభావమూ ఉందని పేర్కొంది. ఫిచ్‌ గ్లోబల్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ (జీఈఓ)నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను గమనిస్తే... 

  • 2020 చివరి ఆరు నెలల కాలంలో భారత్‌ ఎకానమీ గణనీయమైన పురోగతి సాధించింది. ఆర్థిక వ్యవస్థ పటిష్ట తీరుతో 2021లోకి ప్రవేశించింది. తయారీ, సేవలు పురోగతి బాటన పయనిస్తున్నాయి. వినియోగ డిమాండ్‌ బాగుంది. అలాగే రవాణా వ్యవస్థ పుంజుకుంది. 
  • అయితే తాజాగా పెరుగుతున్న కేసులు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే విధంగా సమస్య కొనసాగితే 2021-22 తొలి త్రైమాసికంలో కొన్ని రాష్ట్రాల్లో వృద్ధిపై ప్రభావం చూపే వీలుంది. అలాగే అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భారత్‌ వృద్ధి తీరుపై ప్రభావితం చూపే వీలుంది. 
  • ఫైనాన్షియల్‌ సెక్టార్‌ పరిస్థితి కొంత క్లిష్టంగా ఉంది. ప్రత్యేకించి రుణాలు, పెట్టుబడి వ్యయాల విషయంలో కఠిన పరిస్థితులు నెలకొన్నాయి. 
  • 2022-23లో మాత్రం జీడీపీ వృద్ధి 5.8 శాతానికి పరిమితమవుతుంది. నిజానికి గత అంచనాలకన్నా 0.5 శాతం అంచనాలను తగిస్తున్నాం. 
  • ద్రవ్యోల్బణం తగ్గుదల లేకపోవడం, స్వల్ప కాలంగా చూస్తే, వృద్ధి అవుట్‌లుక్‌ మెరుగ్గా వుండటం వంటి అంశాల నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపో ప్రస్తుత స్థాయి(4 శాతం) నుంచి మరింత తగ్గించే అవకాశం లేదు. అయితే వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) సమస్యలు రాకుండా ఆర్‌బీఐ తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుంది. 
  • బ్యాంకింగ్‌ రంగం అవుట్‌లుక్‌ ఏప్రిల్‌ 1వ తేదీ నుంచీ ప్రారంభమయ్యే వచ్చే ఆరి్థక సంవత్సరం అంత బాగుండకపోవచ్చు. కోవిడ్‌-19 నేపథ్యంలో ఎకానమీలో చోటుచేసుకున్న ప్రతికూల పరిస్థితులు, చిన్న వ్యాపారాలకు జరిగిన నష్టాలు, నిరుద్యోగం, ప్రైవేటు వినియోగంలో తగ్గుదల వంటి అంశాలు ఇంకా పూర్తి స్థాయిలో బ్యాంకింగ్‌ బ్యాలెన్స్‌ షీట్స్‌లో ప్రతిబింబించడంలేదు.
చదవండి:
సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం
మరిన్ని వార్తలు