ఆకస్మిక వరద: 150 మంది గల్లంతు!

7 Feb, 2021 13:48 IST|Sakshi

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో ధౌలిగంగా నది అకస్మాత్తుగా ఉప్పొంగింది. ధౌలిగంగా నదికి అనూహ్యంగా పెద్ద ఎత్తున వరద రావడంతో పవర్‌ప్లాంట్‌ వద్ద మంచుచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. మంచుచరియలు విరిగిపడటంతో నీటిమట్టం భారీగా పెరిగింది. చమోలీ జిల్లా రైనీ తపోవన్‌ వద్ద పవర్‌ ప్రాజెక్ట్‌లోకి నీరు చేరింది. భారీ వరద ప్రవాహానికి ఆనకట్ట కొట్టుకునిపోయింది. వరద నీరు ప్రవేశించడంతో రుషిగంగా పవర్‌ ప్రాజెక్టులోని పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. విద్యుత్‌ కేంద్రానికి చెందిన 150 మంది కార్మికులు వరదలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వీరితో పాటు ఇండో-టిబెటిన్‌ సరిహద్దు పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ధౌలిగంగా నదీ తీరానికి వెళ్లొద్దని స్థానికులకు అధికారులు ఆదేశాలు జారీచేశారు.  వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో ధౌలిగంగా తీరంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సమాచారం అందుకున్న ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌ ఘటనాస్థలికి బయల్దేరారు.  సీఎంతో పాటు చమోలి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ కూడా ఉన్నారు. ఉత్తరాఖండ్‌ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరాతీశారు.  ఉత్తరాఖండ్‌ సీఎం రావత్‌తో ఫోన్‌లో మాట్లాడి సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)



సహాయక చర్యల కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేశారు. 
హెల్ప్‌ లైన్‌ నెంబర్లు: 1070 & 9557444486. 

 

మరిన్ని వార్తలు