బెంగాల్‌ గవర్నర్‌గా మాజీ బ్యూరోక్రట్‌ ఆనంద బోస్‌.. కేంద్రంతో మాంచి అనుబంధం

18 Nov, 2022 09:13 IST|Sakshi

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా మాజీ బ్యూరోక్రట్‌ సీవీ ఆనంద బోస్‌(71)ను నియమించింది రాష్ట్రపతి భవన్‌. ఈ మేరకు గురువారం ఆనంద బోస్‌ నియామకాన్ని ధృవీకరించింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నియామకం అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి భవన్‌ ప్రెస్‌ సెక్రటరీ అజయ్‌ కుమార్‌ పేరిట విడుదలైన సర్క్యులర్‌ వెల్లడించింది.

గతంలో బెంగాల్‌ గవర్నర్‌గా ఉన్న ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మణిపూర్‌ గవర్నర్‌ లా గణేశన్‌ అయ్యర్‌ ప్రస్తుం అదనపు బాధ్యతలు చేపట్టారు. అయితే.. గవర్నర్‌ గణేశన్‌, బెంగాల్‌ ప్రభుత్వంతో సన్నిహితంగా మెదలడంపై ప్రతిపక్ష బీజేపీ అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ క్రమంలో బెంగాల్‌కు పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు విజ్ఞప్తులు చేస్తూ వస్తోంది. 

రిటైర్డు ఐఏఎస్‌ అధికారి అయిన బోస్‌ కేరళలోని కొట్టాయంకు చెందినవారు. జవహార్‌లాల్‌ నెహ్రూ ఫెలోషిఫ్‌కు ఎంపికయ్యారు ఆయన. ముస్సోరీలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీతోనూ ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. రచయితగా ఆంగ్లం, మలయాళం, హిందీ భాషల్లో 40 పుస్తకాలు రాశారు. ఎన్నో నవలలు, లఘు కథలు, పద్యాలు, ఉపన్యాసాలు రచించారు. 

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంతోనూ ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ హయాంలో అభివృద్ధి కోసం ఏర్పాటైన ఓ సంస్థలో ఆయన చైర్మన్‌గా పని చేశారు. అంతేకాదు.. ఆయన రూపొందించిన ‘అందరికీ సరసమైన గృహాలు’ అనే భావన కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందింది కూడా.

మరిన్ని వార్తలు