డాక్టరేట్‌ గ్రహీత.. మాజీ అథ్లెట్‌.. మాజీ టీచర్‌కు దయనీయ పరిస్థితి

10 Sep, 2021 15:52 IST|Sakshi

పదేళ్లుగా ముఖ్యమంత్రిగా పని చేసిన బుద్ధదేవ్‌ భట్టాచార్య

ఆయన భార్య చెల్లెలే ఇరా బసు

మాజీ క్రీడాకారిణి, వైరాలజీలో పీహెచ్‌డీ

ఉపాధ్యాయురాలిగా పదవీ విరమణ

కలకత్తా: పదేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో కీలక నాయకుడిగా వెలుగొందారు. అలాంటి వ్యక్తి భార్య చెల్లెలు అంటే డాబుగీబు దర్పంతో ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఆమె ఫుట్‌పాత్‌పై భిక్షమెత్తుకుంటున్న దౌర్భాగ్యపు పరిస్థితి. పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బరాబజార్‌ ప్రాంతంలోని దున్లాప్‌లో ఆమె మాసిపోయిన దుస్తులతో కనిపించింది. ఫుట్‌పాత్‌పైనే ఆమె జీవనం గడుపుతున్న దుస్థితి.
చదవండి: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు

బుద్ధదేవ్‌ భట్టాచార్య పదేళ్ల పాటు బెంగాల్‌ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన భార్య మీరా. ఆమె సోదరినే ఇరా బసు. ఫుట్‌పాత్‌పై ఉంటున్న ఇరా వైరాలజీలో పీహెచ్‌డీ చేసింది. ఆమె అద్భుతంగా ఆంగ్లంతోపాటు బెంగాలీ మాట్లాడగలదు. అంతేకాదు రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నీస్‌ క్రీడాకారిణి. క్రికెట్‌లో కూడా రాష్ట్రస్థాయిలో ఆడింది. అలాంటి ఇరా రెండేళ్లుగా ఫుట్‌పాత్‌పై నివసిస్తోంది. 1976లో ప్రియానాథ్‌ బాలిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఇరా బసు 2009లో పదవీ విరమణ పొందారు.

ఆమె టీచర్‌గా ఉన్నప్పుడు బావ బుద్ధదేవ్‌ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో బరానగర్‌లో ఉంటున్న ఆమె ఖర్దాలోని లిచూ బగాన్‌కు మకాం మార్చారు. కొన్నాళ్లకే ఏమైందో ఏమోగానీ ఆమె పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు దున్లాప్‌లోని ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తోంది. ఆమె అలా జీవనం సాగించడంపై ఆమె పనిచేసిన ప్రియానాథ్‌ పాఠశాల హెడ్‌ మిస్ట్రెస్‌ కృష్ణకాలి చందా స్పందించారు. ‘ఇరా బసు మా పాఠశాలలోనే బోధించారు. పదవీ విరమణ అనంతరం పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోమని చెబితే ఇంతవరకు ఆమె పత్రాలు సమర్పించలేదు. ఆమె ఎందుకు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోలేదో తెలియదు’ అని పేర్కొన్నారు.

అయితే మొన్న ఉపాధ్యాయ దినోత్సవం నాడు మాత్రం ఇరాబసును కొందరు స్థానిక సంఘాల నాయకులు సన్మానించారు. పూలమాల.. శాలువా వేసి సన్మానించారు. ఆ సమయంలో ఇరా బసు మాట్లాడింది. ‘నన్ను ఎంతో మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా నన్ను ప్రేమిస్తున్నారు. కొందరు నన్ను కౌగిలించుకుని కన్నీళ్లు పెడతారు’ అని తెలిపింది. ఈ సందర్భంగా తన బావ బుద్ధదేవ్‌ భట్టాచార్య గురించి మాట్లాడింది. ‘నేను టీచర్‌గా ఉన్నప్పుడే అతడి నుంచి ఎలాంటి లబ్ధి పొందను. నా కుటుంబ వివరాలు తెలుసుకున్న వారందరూ నాకు వీఐపీ గుర్తింపు ఇవ్వనవసరం లేదు’ అని స్పష్టం చేసింది. ఆమె ఫుట్‌పాత్‌పై జీవిస్తున్నది తెలుసుకున్న అధికారులు ఆమెను వెంటనే అంబులెన్స్‌లో కలకత్తాకు తీసుకెళ్లారు. ఆమెకు వైద్యారోగ్య పరీక్షలు చేయించి చికిత్స అందించే అవకాశం ఉంది. ఆమె బాగోగులు ప్రభుత్వం చూసుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు