కరోనా : జైపూర్ మాజీ మహారాజా కన్నుమూత

3 Dec, 2020 10:05 IST|Sakshi

కరోనా సమస్యలతో  మాజీ ఎంపీ పృథ్వీరాజ్  మృతి

జైపూర్‌: కోవిడ్-19 సమస్యలతో రాజస్థాన్‌ దౌసాకు చెందిన జైపూర్ మాజీ మహారాజా, మాజీ ఎంపీ పృథ్వీరాజ్ (84) బుధవారం సాయంత్రం కన్నుమూశారు. కోవిడ్‌-19 బారిన పడి కోలుకున్న ఆయనకు అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు రావడంతో తుదిశ్వాస తీసుకున్నారు. జైపూర్‌కు చెందిన పూర్వపు రాజకుటుంబానికి చెందిన పృథ్వీరాజ్ రాజస్థాన్‌ను ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.

ప్రస్తుతం పృథ్వీరాజ్‌ ఒకప్పటి జైపూర్ పాలకుల నివసించిన ప్రసిద్ధ రాంబాగ్ ప్యాలెస్ డైరెక్టర్‌గా ఉన్నారు. దివంగత అధికారిక జైపూర్ మహారాజా సవాయి మాన్ సింగ్, మాజీ మహారాణి కిషోర్ కన్వర్ కుమారుడు పృథ్వీరాజ్‌. 1962లో స్వతంత్ర పార్టీ టిక్కెట్‌పై దౌసా నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజ కుటుంబానికి చెందిన చివరి వారసుడు అయిన పృథ్వీరాజ్‌ తదనంతర కాలంలో రాంబాగ్ ప్యాలెస్‌ను లగ్జరీ హోటల్‌గా మార్చారు. త్రిపుర యువరాణి అతని సవతి తల్లి గాయత్రీ దేవి మేనకోడలు దేవికా దేవిని వివాహం చేసుకున్నారు. ఆయనకు కుమారుడు విజిత్ సింగ్ ఉన్నారు. తన అంకితభావం, దక్షతతో క్లిష్ట వ్యవహారాలను సైతం చక్కబెట్టగల సమర్ధుడిగా పృథ్వీరాజ్ కీర్తి గడించారు

మరిన్ని వార్తలు