వాహనదారులకు కేంద్రం తీపికబురు

21 Feb, 2021 16:32 IST|Sakshi

మీకు కారు కానీ ఏదైనా భారీ వాహనం కలిగి ఉన్నారా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపికబురు అందించింది. ఉచితంగానే ఫాస్టాగ్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2021 మార్చి 1 వరకు దేశవ్యాప్తంగా ఉన్న 770 టోల్ ప్లాజాలలో (స్టేట్ ప్లాజాతో సహా) ఉచితంగానే ఫాస్టాగ్ పొందవచ్చు అని ఎన్‌హెచ్ఏఐ తెలిపింది. దీనితో వాహనదారులకు రూ.100 ఆదా కానుంది. జాతీయ రహదారులపై నడిచే వాహనాల యూజర్ల ఫాస్టాగ్ వినియోగించడాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం, ఫాస్టాగ్ ను 87 శాతం మంది వినియోగదారులు వాడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ఫాస్టాగ్ వినియోగం 7 శాతం పెరిగింది. ఇక దేశంలో 100 టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్ వినియోగించే వారి సంఖ్య 90శాతం చేరుకుంది. ఒక్కరోజులోనే ఫాస్టాగ్ ద్వారా 63 లక్షల లావాదేవీలతో రూ.100 కోట్ల టోల్ వసూలు చేశారు. టోల్ ప్లాజా దగ్గర ఏదైనా సాంకేతిక లోపం ఉంటే ఫాస్టాగ్‌లలో బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఒక్క పైసా కూడా చెల్లించకుండా వినియోగదారులు టోల్ ప్లాజాలు దాటవచ్చు అని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. గత రెండు రోజుల్లో 2.5 లక్షలకు పైగా ట్యాగ్ల అమ్మకాలు జరిగాయని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది. ప్రతి వాహనదారుడి దగ్గర ఫాస్టాగ్ తప్పక ఉండాల్సిందే. లేదంటే భారీ జరిమానా పడుతుంది.

చదవండి:

వాట్సాప్‌కు దీటుగా స్వదేశీ సందేశ్ యాప్

మరిన్ని వార్తలు