Frog In Idli Packet: ఇడ్లీ పార్సిల్‌లో కప్ప కలకలం.. హోటల్‌ యజమానికి చూపిస్తే..

29 Nov, 2021 10:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,తిరువొత్తియూరు(చెన్నై): తంజావూరు జిల్లా కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి తీసుకున్న ఇడ్లీ పార్సిల్‌లో కప్ప కళేబరం ఉండడం సంచలనం కలిగించింది. కుంభకోణం మాదాపురికి చెందిన మురుగేష్‌ గుండె చికిత్స విభాగంలో చికిత్స పొందుతున్నాడు. అతని బంధువు శనివారం సమీపంలోని ఒక హోటల్లో ఇడ్లీ పార్సిల్‌ తీసుకువెళ్లాడు. ప్యాకెట్‌ విప్పి చూడగా ఇడ్లీ లోపల కప్ప మృతి చెంది ఉంది. దాన్ని బంధువులు హోటల్‌ యజమానికి చూపించారు. హోటల్లో ఉన్న ఇడ్లీ పిండిని కింద పడేశారు. హోటల్‌ యజమాని హోటల్‌కు తాళం వేసి పరారయ్యాడు. ఈ దృశ్యాలను ఒక వ్యక్తి తన సెల్‌ ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టడంతో వైరల్‌ అయింది.   

సదస్సు విజయవంతం
కొరుక్కుపేట: ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం వడపళని క్యాంపస్‌(చెన్నై), లింకన్‌ యూనివర్సి టీ కాలేజ్‌ మలేషియా ఆధ్వర్యంలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (ఐసీఈఏబీఎం 2021) అంతర్జాతీయ సదస్సు విజయవంతంగా జరిగింది. ఎస్‌ఆర్‌ఎం వడపళని క్యాంపస్‌ సీఈటీ విభాగం డీన్‌ డాక్టర్‌ సి.వి.జయకుమార్, కాలేజ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ సుభశ్రీ నటరాజన్‌ నేతృత్వం వహించారు. ప్యూర్టో రికో విశ్వవిద్యాలయం యూఎస్‌ఏ ప్రొఫెసర్‌ జస్టిన్‌ పాల్, సీవీఆర్‌ డీఈచెన్నై డైరెక్టర్‌ వి.బాలమురుగన్, ప్రొఫెసర్‌ శ్యామ్‌ బహదూర్‌ మేనేజ్మెంట్‌ టెక్నాలజీపై ప్రసంగించారు.   

మరిన్ని వార్తలు