పట్టాలెక్కనున్న ఫైవ్‌ స్టార్‌ హోటల్‌.. దేశంలో తొలిసారి ఇలా

13 Jul, 2021 21:19 IST|Sakshi

గాంధీనగర్‌: దేశంలో తొలిసారిగా ఓ ఫైవ్ స్టార్ హోటల్ రైలు పట్టాలెక్కబోతుంది. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ రైలు పట్టాలెక్కడమేంటి అని ఆలోచిస్తున్నారు. అయితే ఇది చదవండి. గుజరాత్‌లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్‌ను భారత రైల్వేశాఖ కొత్త హంగులతో సుందరీకరిస్తుంది. ఇందులో భాగంగా ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను పట్టాలపై నిర్మించాలని ఓ వినూత్న ఆలోచన చేసింది. దేశంలో తొట్టతొలిసారి నిర్మించ తలపెట్టిన ఇలాంటి ప్రాజెక్ట్‌ను భారతీయ రైల్వేస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్మిస్తుంది.

ఈ ఫైవ్ స్టార్ హోటల్‌ను లీలా గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వహించనున్నట్లు రైల్వే వర్గాల సమాచారం. మూడు టవర్లుగా నిర్మించే ఈ హోటల్‌లో మొత్తం 300 గదులు ఉండనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. ఈ ఐదు నక్షత్రాల హోటల్‌ కింద రైళ్లు తిరుగుతున్నా ఎలాంటి ప్రకంపనలు కానీ శబ్దాలు కానీ హోటల్‌లో ఉన్న వారికి వినిపించకుండా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. నిజానికి అంతర్జాతీయంగా ఇలాంటి ప్రాజెక్టులు సాధారణమే అయినా.. భారత్‌లో మాత్రం రైలు పట్టాలపై ఇదే తొలి ఫైవ్ స్టార్ హోటల్ అని వెల్లడించారు. దీని నిర్మాణానికి రెండేళ్ల సమయం పడుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు