బెంగళూరు ఈద్గాలో గణేష్‌ ఉత్సవాలకు బ్రేక్‌.. స్టేటస్‌ కో విధించిన సుప్రీం కోర్టు

30 Aug, 2022 18:59 IST|Sakshi

బెంగళూరు: బెంగళూరులోని ఈద్గా మైదానంలో రెండు రోజుల పాటు గణేష్‌ ఉత్సవాలకు కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇవ్వటంపై కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక వక్ఫ్‌ బోర్టు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ ఏఎస్‌ ఓకా, జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. గణేష్‌ ఉత్సవాలకు బ్రేకులు వేసింది ధర్మాసనం. స్టేటస్‌ కో విధిస్తూ ఆదేశాలిచ్చింది. దీని ప్రకారం.. ఆ మైదానంలో ఎలాంటి మతపరమైన ఉత్సవాలు జరపకూడదు. 

విచారణ సందర్భంగా వక్ఫ్‌ బోర్డు తరపున వాదనలు వినిపించారు సీనియర్‌ అడ్వకేట్‌ దుష్యంత్‌ దావే. తమ హక్కులు అణచివేతకు గురవుతున్నాయనే భావన మతపరమైన మైనారిటీలకు కలుగకుండా చూడాలని కోరారు. ఈ మైదానంలో 200 ఏళ్లుగా ఇతర మతాల కార్యక్రమాలు నిర్వహించటం లేదని, చట్ట ప్రకారం ఇది వక్ఫ్‌ బోర్డు ఆస్తిగా తెలిపారు. 2022లో ఇది వివాదాస్పద స్థలమని ప్రకటించారని, ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలనుకుంటున్నారని ధర్మాసనానికి నివేదించారు. మరోవైపు.. ఇది ప్రభుత్వం పేరుతో ఉందని, చాలా ఏళ్లుగా పిల్లలు ఆడుకునే ఆట స్థలంగానే కొనసాగుతున్నట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. 

ఈద్గా మైదానంలో గణేష్‌ ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వటాన్ని అంతకు ముందు కర్ణాటక హైకోర్టు సైతం ఏకీభవించింది. ప్రభుత్వం అనుమతులు ఇవ్వవచ్చని తెలిపింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది కర్ణాటక వక్ఫ్‌బోర్డు. తాజాగా స్టేటస్‌ కో విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయటం వల్ల.. ప్రస్తుతం మరో కొత్త సమస్య తలెత్తింది. ఇప్పుడు ఆ స్థలం ప్రభుత్వానిదా లేక వక్ఫ్‌బోర్డుదా? అనే విషయం హైకోర్టు పరిధిలోకి వెళ్లింది.

ఇదీ చదవండి: ఎక్కడికి పోతావు చిన్నవాడా? పరారైన వరుడిని వెంబడించి పట్టుకున్న వధువు

మరిన్ని వార్తలు