32 ఏళ్లనాటి కేసులో గ్యాంగ్‌స్టర్ ముఖ్తర్ అన్సారీకి జీవిత ఖైదు

5 Jun, 2023 16:07 IST|Sakshi

ఉత‍్తరప్రదేశ్‌: 32 ఏళ్ల నాటి హత్య కేసులో ఐదుసార్లు ఎమ్మెల్యే, గ్యాంగ్‌స్టర్ ముఖ్తర్ అన్సారీకి వారణాసి కోర్టు జీవిత ఖైదు విధించింది. దాంతో పాటు లక్ష రూపాయల జరిమానాను కూడా విధించింది. అతనిపై నమోదైన 61 కేసుల్లో ఇది ఆరో కేసు. అతడు నిందితుడిగా ఉన్న మరో  20 కేసులు విచారణ దశలో ఉన్నాయి. ముఖ్తర్ అన్సారీకి గత ఏప్రిల్‌లోనే ఓ కిడ్నాప్, హత్య కేసులో పదేళ్ల జైలు శిక్ష పడింది. అతనిపై అనేక క్రిమినల్ కేసులు, భూకబ్జాలు, హత్య, దోపిడీ కేసులు నమోదయ్యాయి.

అన్సారీ రాజకీయంలోకి రాకముందు 1991లోనే కాంగ్రెస్ నాయకుడి హత్య కేసులో నిందితునిగా ఉన్నాడు. 1991 ఆగష్టు 3న మాజీ ఎమ్మెల్యే అజయ్ రాజ్ సోదరుడు అవదేశ్ రాయ్‌ని దుండగులు కాల్చి చంపారు. ఈ కేసులో ముఖ్తర్ అన్సారీ, భీమ్ సింగ్, ఎమ్మెల్యే అబ్దుల్ కలీమ్‌తో సహా మరో ఇద్దరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసులో ముఖ్తర్ అన్సారీని వారణాసి కోర్టు మే19 దోషిగా తేల్చి, తీర్పును రిజర్వ్ చేసింది.

ఉత్తరప్రదేశ్‌ చరిత్రలోనే సంచలనమైన బీజేపీ నాయకుడు కృష్ణానంద్ రాయ్‌ హత్య కేసులోనూ అన్సారీ నిందితుడిగా ఉన్నాడు. ముఖ్తర్ అన్సారీ 1996, 2002, 2007,2012తో సహా 2017లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇతని కుమారుడు అబ్బాస్ అన్సారీ 2022లో ఎస్‌బీఎస్పీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  

ప్రస్తుత తీర్పుతో అవదేశ్ రాయ్ సోదరుడు అజయ్ రాజ్‌ సంతోషం వ్యక్తం చేశారు.'32 ఏళ్ల పోరాటానికి నేటికి దోషికి శిక్ష పడింది. ప్రభుత్వాలు మారాయి. అన్సారీ మరింత బలపడ్డారు.నేను, నా తల్లిదండ్రులు, సోదరుడు అవదేశ్ పిల్లలు ఎంతో ఓర్పుతో పోరాడాము' అని ఆయన అన్నారు.  

ఇదీ చదవండి:మంచు పెళ్లలు విరిగిపడి మహిళ మృతి

మరిన్ని వార్తలు