స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్.. నలుగురు మ‌ృతి

6 Jan, 2021 17:06 IST|Sakshi

ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో బుధవారం గ్యాస్ లీకవ్వడం వల్ల నలుగురు కార్మికులు మృత్యువాత పడగా, మరి కొంత మందికి గాయాలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నసెయిల్‌(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) రూర్కెలా స్టీల్‌ ప్లాంట్‌లోని ఓ యూనిట్‌లో బుధ‌వారం ఉద‌యం ఒక్కసారిగా విష‌పూరిత గ్యాస్ లీకయ్యింది. ప్లాంట్‌లోని కోల్ కెమిక‌ల్ డిపార్ట్‌మెంట్ ప్లాంట్ నుంచి కలుషిత గాలి వ్యాపించింది. దాన్నిపీల్చి స్పృహ త‌ప్పి ప‌డిపోయిన వారిని ప్లాంట్ స‌మీపంలో ఉన్న హాస్పిట‌ల్‌లో చేర్పించగా. అనంతరం ఐసీయూలో చికిత్స పొందుతూ నలుగురు కార్మికులు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద స‌మ‌యంలో ప్లాంట్‌లో 15 మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారని పేర్కొన్నారు. చదవండి: ర‌త‌న్ టాటా కారుకు ఈ-చ‌లాన్లు..?

మరికొందరు క్షతగాత్రులను ఇస్పాట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌కి తరలించారు. మిగిలినవారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. కాగా మరణించిన నలుగురు ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. యూనిట్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదల కావడం వల్ల ఈ నలుగురు కార్మికులు మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. గ్యాస్ లీకేజీకి సంబంధించి సమాచారం అందుకున్న అగ్ని మాప‌క సిబ్బంది అక్కడ‌కు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆర్‌ఎస్‌పీ అధికారులు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు