గ్యాస్‌ స్టవ్‌లతో కూడా ‘ఆస్తమా’!

21 Dec, 2020 15:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇప్పటికీ మీరు కట్టెల పొయ్యి ఉపయోగిస్తున్నారా?’ అంటూ అవాక్కవుతాం, గ్యాస్‌ పొయ్యి వాడని వారిని చూసి. కట్టెల పొయ్యి నుంచి పొగ వస్తుందని, ఆ పొగ వల్ల వంటచేస్తున్న వారు ఉక్కిరిబిక్కిరవుతారని, వారి ఊపిరి తిత్తులు దెబ్బతింటాయని, పైగా ఆ పొగ వల్ల వాతావరణ కాలుష్యం కూడా పెరగుతుందని ఎవరైనా చెబుతారు. అందుకే కట్టెల పొయ్యిలతో నేటికి కుస్తీలు పడుతున్న మహిళలను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఉజ్వల పథకం’ కింద ఇంటింటికి గ్యాస్‌ స్టవ్‌ పథకాన్ని ప్రారంభించారు.

వాస్తవానికి గ్యాస్‌ స్టవ్‌ల వల్ల కూడా పిల్లలకు ఆస్తమా వస్తోందని, వాతావరణ కాలుష్యం కూడా పెరగుతోందని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్నారు. గ్యాస్‌ స్టవ్‌ వెలిగించి నేచురల్‌ గ్యాస్‌ను మండించడం వల్ల మంచి నీలి రంగు మంట వస్తుంది. మంటను ఏ స్థాయిలో పెట్టుకోవాలంటే ఆ స్థాయిలో పెట్టుకోవచ్చు. ఊపిరి తిత్తులను ఉక్కిరిబిక్కిరి చేసే పొగకు అవకాశమే ఉండదు. కానీ మంట వల్ల కూడా కార్బన్‌ డయాక్సైడ్‌ వెలువడుతుంది. అలా వెలువడే కిలో కార్బన్‌ డయాక్సైడ్‌తోపాటుగా 34 గ్రాముల కార్బన్‌ మోనాక్సైడ్, 79 గ్రాముల నైట్రోజన్‌ ఆక్సైడ్, ఆరు గ్రాముల సల్ఫర్‌ ఆక్సైడ్‌లు విడుదలవుతాయి. (రైతుల ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా బ్లాక్‌ : ఫేస్‌బుక్‌ స్పందన)

ఇక వాతావరణాన్ని కాలుష్యానికి కారణమయ్యే ధూళి లేదా నుసి రేణువులు ‘పీఎం 2.5 (పర్టికులేట్‌ మ్యాటర్‌ డయామీటర్‌లో 2.5 మైక్రోమీటర్‌కన్నా తక్కువ పరిణామం ఉండడం)’ కూడా విడుదలవుతాయి. ఎలక్ట్రిక్‌ స్టవ్‌లకన్నా గ్యాస్‌ స్టవ్‌ల వల్ల నుసి రేణువులు రెట్టింపు విడుదలవుతాయి. అదే కట్టెల పొయ్యిల వల్ల ఈ నుసి రేణువులు ఏడు వందల రెట్లు పెరగుతాయి. ఆ పొయ్యిల వల్ల సల్ఫర్‌ డయాక్సైడ్‌ కూడా ఎక్కువగానే విడుదలవుతుంది. బొగ్గులు, కట్టెల పొయ్యిల కన్నా గ్యాస్‌ స్టవ్‌లు తక్కువ కాలుష్యాన్ని కలుగ జేస్తాయంటూ వాదించే వారు లేకపోలేదు. పొదలు, అడవులు అంటుకోవడం వల్ల, డీజిల్‌ వాహనాల వల్ల, కట్టెల పొయ్యిలు, కట్టెల బాయిలర్లు వల్ల, పంట దుబ్బలను తగుల పెట్టడంతోపాటు గ్యాస్‌ స్టవ్‌ల వినియోగం వల్ల వెలువడే నైట్రోజెన్‌ డయాక్సైడ్, పీఎం 2.5’ రేణువులతో మనుషుల, ముఖ్యంగా పిల్లల ఊపిరితుత్తులు దెబ్బతింటాయి,   ఆస్తమా లాంటి జబ్బులు వస్తాయి. గ్యాస్‌ ఈటర్ల వల్ల కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది.

‘పిల్లలకు సహజంగా వచ్చే  ఆస్తమా కన్నా గ్యాస్‌ కుకింగ్‌ ఇళ్లలో నివసిస్తోన్న పిల్లల్లో ఆస్తామా వచ్చే అవకాశాలు 42 శాతం పెరిగినట్లు ‘నెదర్లాండ్స్‌లో నిర్వహించిన ఓ సర్వే’లో వెల్లడయింది. అమెరికా ఇళ్లలో గ్యాస్‌ కూకర్స్‌ను ఉపయోగించడం వల్ల నైట్రోజన్, డయాక్సైడ్‌ ఎక్కువగా విడుదలవుతున్నట్లు అమెరికాలో నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. గ్యాస్‌ స్టవ్‌ వినియోగం వల్ల 80 ఇళ్లలో ఏడేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు మధ్య వయస్కు పిల్లలు ఆస్తమా బారిన పడినట్లు ‘ఆస్ట్రేలియన్‌ స్టడీ ఇన్‌ ది లాత్రోబ్‌ వ్యాలీ’లో వెల్లడయింది. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్‌ స్టవ్‌ల వినియోగం వల్ల పిల్లల్లో అస్తమా వచ్చే అవకాశాలు 12.8 శాతం ఉండగా, మంచి వెంటిలేషన్‌ వల్ల లేదా మంచి చిమ్నీల వల్ల ఆ ప్రమాదాన్ని 3.4 శాతం తగ్గుంచుకోవచ్చు’ అని అడెలేడ్‌ యూనివర్శిటీలో ఫార్మకాలోజీ సీనియర్‌ అధ్యాపకులు ఐయాన్‌ ముస్‌గ్రేవ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు