గౌతమ్ గంభీర్‌ను దోషిగా తేల్చిన డ్రగ్ కంట్రోలర్‌

3 Jun, 2021 15:13 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్ నిర్వహిస్తున్న ఫౌండేష‌న్ ఫాబీఫ్లూ ట్యాబ్లెట్ల‌ను అనధికారికంగా నిల్వ ఉంచడమే కాకుండా, పంపిణీ చేసినందుకు ఆ ఫౌండేషన్‌ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) దోషిగా తేల్చింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో గౌతం గంభీర్‌ను దోషిగా పేర్కొంది. డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్‌ యాక్ట్ ప్రకారం ఫాబీఫ్లూ టాబ్లెట్లను నిల్వ ఉంచడం నేరమని కోర్టుకు తెలిపింది. కాగా, ఇదే యాక్ట్ ప్ర‌కారం ఆప్ ఎమ్మెల్యే ప్ర‌వీణ్ కుమార్ కూడా దోషిగా తేలిన‌ట్లు తెలిపింది. కాగా దోషిగా తేలిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైకోర్టు డీజీసీఐని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ జూలై 29న జ‌ర‌గ‌నుంది. 

ఇటీవల గౌత‌మ్ గంభీర్ ఢిల్లీలో క‌రోనా రోగుల‌కు ఫాబీఫ్లూ ట్యాబ్లెట్ల‌ను పంచిన విష‌యం తెలిసిందే. దీనిపై దాఖ‌లైన పిటిష‌న్‌లో డ్ర‌గ్ కంట్రోల‌ర్ విచార‌ణ చేప‌ట్టింది. ఈ విచారణలో గంభీర్ ఫౌండేషన్‌కు డీసీజీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. కాగా జస్టిస్ విపిన్ సంఘి, జస్మీత్ సింగ్ ల డివిజన్ బెంచ్ డీజీసీఐను మందలిస్తూ మరోసారి నివేదిక, దర్యాప్తునకు ఆదేశించింది. అయితే డీజీసీఐ తాజాగా కోర్టుకు సమర్పించిన నివేదికలో దోషిగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి మరింత పురోగతి విచారణ కోసం కోర్టు ఆరు వారాల గడువు ఇచ్చింది.

చదవండి: vaccine: మినహాయింపులపై సీరం కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు