జల వివాదాలకు చెక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

16 Jul, 2021 10:38 IST|Sakshi

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై వెలువడిన గెజిట్‌ నోటిఫికేషన్‌

ఇక ఉమ్మడి ప్రాజెక్టులు, సిబ్బంది అంతా బోర్డు పరిధిలోకే..

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లో తరచూ రేగుతున్న జల వివాదాలకు చెక్‌పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేళ్లుగా ఎటూ తేలకుండా వాయిదా పడుతూ వస్తున్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గురువారం అర్ధరాత్రి కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కృష్ణా బోర్డు సమర్ధవంతంగా పనిచేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) బ్యాంక్‌ అకౌంట్‌లోకి 60 రోజుల్లోగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు చెరో రూ.200 కోట్ల చొప్పున జమ చేయాలని సూచించింది. నోటిఫికేషన్‌ విడుదలతో కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులు, వాటి నిర్వహణ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సిబ్బంది అంతా బోర్డుల పరిధిలోకి వచ్చాయి.

ప్రాజెక్టుల నీటి నిర్వహణతో పాటు భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షించనున్నాయి. ఈ నోటిఫికేషన్‌ జారీ చేసే నాటికి కేంద్రం ఆమోదించని ప్రాజెక్టుల పనులన్నింటిని ఇరు రాష్టాలు నిలిపివేయాలని పేర్కొంది. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో నిర్ణయించిన మేరకు అనుమతులు లేని ప్రాజెక్టులను అపెక్స్‌ కౌన్సిల్‌కు పంపి 6 నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని సూచించింది. ఆరు నెలల్లో అనుమతి పొందకపోతే ఆ ప్రాజెక్టులను రద్దు చేసుకోవాలని, వాటి ద్వారా ఎలాంటి నీటిని తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 14 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం వివరించింది.
 

బోర్డుల పరిధిపై కుదరని అభిప్రాయం.. 
కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్‌ 85(1) ప్రకారం కేంద్రం.. బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే బోర్డులకు.. వాటి పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్‌ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడంతో వీటికి ఎలాంటి అధికారాలు లేవు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నా బోర్డులు ఏమీ చేయలేకపోతున్నాయి. ఈ క్రమంలో తమ పరిధిని ఖరారు చేసి ప్రాజెక్టులపై పెత్తనం ఇవ్వాలని బోర్డులు కోరాయి. దీనిపై తెలంగాణ, ఏపీ మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.

ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదని, ఈ అంశంపై ప్రస్తుతం బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణ చేస్తోందని పేర్కొంది. విభజన చట్టం సెక్షన్‌–87 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేశాకనే బోర్డు పరిధిని నోటిఫై చేయాలని.. 2016, సెప్టెంబర్‌ 21న జరిగిన తొలి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ, 2020, అక్టోబర్‌ 6న జరిగిన రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది.

అయితే ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటి నుంచో కోరుతోంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా బోర్డు నియంత్రణ అవసరమని చెబుతూ వచ్చింది. ఈ వైరుధ్యాలు ఉన్నా.. రెండో అపెక్స్‌ భేటీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ బోర్డుల పరిధిని ఖరారు చేసే అధికారం తమకుందని స్పష్టం చేశారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనిపై చర్చించి నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.

గోదావరి.. బోర్డు పరిధిలోకి ఎందుకు... 
ఇక గోదావరి బేసిన్‌ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చుకోవడాన్ని తెలంగాణ తప్పుపడుతోంది. గోదావరి బేసిన్‌లో తెలంగాణ, ఏపీల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు లేవని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు లేక ఇరురాష్ట్రాల మధ్య సంయుక్తంగా నిర్మించిన ప్రాజెక్టులు లేనందున దీని పరిధిని ఖరారు చేయ రాదని గతంలో కేంద్రానికి లేఖలు రాసింది.

రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 87 ప్రకారం గతంలో ఉన్న అవార్డులు, అంతర్రాష్ట్ర నదీ వివా దాల చట్టం–1956 మేరకు ఏర్పడ్డ ట్రిబ్యునల్‌ల తీర్పులకు లోబడి కేంద్రం బోర్డుల పరిధిని నోటిఫై చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది. గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డులో ప్రాజెక్టులను బోర్డుల పరిధికి తీసుకోవడానికి సంబంధించి ఎలాంటి అంశాలు లేవని దృష్టికి తెచ్చింది. కొత్త మార్గదర్శకాలను తెలంగాణ, ఏపీలోని గోదావరి ప్రాజెక్టులపై రుద్దరాదని స్పష్టం చేసింది. అయినా దీని పరిధిపైనా గెజిట్‌ ఇచ్చేందుకే కేంద్రం మొగ్గు చూపింది.

కృష్ణా బోర్డు పరిధిలో.. 
కృష్ణా బోర్డు పరిధి నోటిఫై కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ దాని పరిధిలోకి వెళ్లాయి. అందులో తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉన్న హెచ్‌ఎల్‌సీ(హైలెవల్‌ కెనాల్‌), ఎల్‌ఎల్‌సీ(లోలెవల్‌ కెనాల్‌), కేసీ కెనాల్, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాలపై ఆధారపడి ఉన్న విద్యుత్‌ కేంద్రం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, శ్రీశైలంపై ఆధారపడ్డ తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు–నగరి, హంద్రీనీవా, ముచ్చు మర్రి, వెలిగొండ, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, శ్రీలైలం కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాలు, సాగర్‌పై ఆధారపడిన కుడి, ఎడమ కాల్వలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఏఎంఆర్‌పీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వచ్చాయి. అలాగే కాళేశ్వరం, దేవాదుల, నిజాంసాగర్, సింగూరు, ఎస్సారెస్పీ, లోయర్‌మానేరు, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీ, చింతలపూడి, పురుషోత్తపట్నం గోదావరి బోర్డు పరిధిలోకి వెళ్లాయి.

ప్రధానికి రెండు దఫాలు సీఎం జగన్‌ లేఖలు
బోర్డు పరిధి ఖరారైనందున కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం కనీస స్థాయి కంటే దిగువన ఉన్నప్పటికీ తెలంగాణ సర్కార్‌ అక్రమంగా ఎడమ గట్టు కేంద్రంలో జూన్‌ 1నే విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అయితే తెలంగాణ సర్కారు కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తిని చేపట్టింది.

కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితిని సృష్టించి రాష్ట్ర హక్కులను కాలరాస్తున్న తెలంగాణ సర్కార్‌ తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండుదఫాలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌సింగ్‌ షెకావత్‌లకు లేఖలు రాశారు. గతేడాది అక్టోబర్‌ 6న అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు అధీనంలోకి తేవాలని, వాటికి సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో భద్రత కల్పించి బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపుల మేరకు ఇరు రాష్ట్రాలకు నీటిని విడుదల చేయాలని కోరారు. కానీ.. తెలంగాణ సర్కార్‌ తీరులో మార్పు రాకపోవడంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసేలా కేంద్రానికి నిర్దేశం చేయాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో రెండు బోర్డుల పరిధిని కేంద్రం ఖరారు చేసింది.   

మరిన్ని వార్తలు