విషాదం: 25వ అంతస్తు నుంచి పడి కవలలు మృతి

18 Oct, 2021 10:43 IST|Sakshi
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 25వ అంతస్తు నుంచి కిందపడి ఇద్దరు కవల సోదరులు మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆ వివరాలు..

తొమ్మిదవ తరగతి చదువుతున్న సత్యనారాయణ, సూర్యనారాయణ ఇద్దరు కవలలు. వీరికి మరో సోదరి కూడా ఉంది. చెన్నైకి చెందిన వీరు రెండు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులతో కలిసి ఘజియాబాద్‌ వచ్చారు. అక్కడ సిద్ధార్థ్‌ విహార్‌ కాంప్లెక్స్‌లో 25వ అంతస్తులో నివసిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి భోజనం ముగించుకుని.. తల్లి మొబైల్‌ తీసుకుని ఆన్‌లైన్‌ క్లాస్‌ విన్నారు. ఆ తర్వాత బాల్కనీలోకి వెళ్లి కూర్చుని మొబైల్‌లో గేమ్స్‌ ఆడసాగారు. 
(చదవండి: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన బిస్కెట్లు, చిప్స్‌..?)

తల్లి వచ్చి పడుకోమని చెప్పడంతో ఇంట్లోకి వెళ్లారు కవల సోదరులు. తల్లి నిద్రపోయిన తర్వాత తిరిగి బాల్కనీలోకి వచ్చారు ఇద్దరు సోదరులు. అర్థరాత్రి 1 గంట సమయంలో ఇద్దరు సోదరులు 25వ అంతస్తు నుంచి పడి.. మృతి చెందారు. కాసేపటి తర్వాత తల్లి లేచి పిల్లల కోసం వెతికింది. బాల్కనీ తలుపు తీసి ఉండటంతో అక్కడకు వెళ్లి చూసింది.. కానీ కనిపించలేదు.  కింద జనాలు గుంపులుగా చేరడం చూసి అక్కడకు వెళ్లింది. అక్కడ ఆమెకు కనిపించిన దృశ్యం చూసి ఒక్కనిమిషం ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది.
(చదవండి: వీథి బాలల్ని బడిపిల్లలుగా మార్చింది...మమ్మీజీ)

కింద రక్తపు మడుగులో తన ఇద్దరు కుమారులు విగత జీవులుగా పడి ఉండటాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. బిడ్డల మృతదేహాలను పట్టుకుని గుండెలవిసేలా ఏడ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి.. కేసు నమోదు చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సత్య, సూర్యల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. బాల్కనీలో మాకు ప్లాస్టిక్‌ చైర్‌, దాని మీద ఓ కూర్చి కనిపించింది. చంద్రుడిని చూడాలని భావించి.. ఇలా ఏర్పాటు చేసుకుని ఉంటారు. కానీ దురదృస్టవశాత్తు పైనుంచి కిందపడి మరణించి ఉంటారని భావిస్తున్నాం. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి’’ అని తెలిపాడు. 

చదవండి: 70 ఏళ్ల తర్వాత కలుసుకుని.. అరుదైన రికార్డు సృష్టించిన కవలలు

మరిన్ని వార్తలు