Ghulam Nabi Azad: లోయలో ర్యాలీలకు ముందు ఆజాద్‌కు షాక్.. ఉగ్రవాదుల బెదిరింపు పోస్టర్లు ప్రత్యక్షం

15 Sep, 2022 14:59 IST|Sakshi

శ్రీనగర్‌: కాంగ్రెస్ మాజీ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపింది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్‌ ఫ్రంట్‌ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మిషన్ కశ్మీర్‌ కార్యక్రమంలో భాగంగా జమ్ముకశ్మీర్‌లో ఆజాద్‌ ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే ముష్కర సంస్థ ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు ప్రచురించడం ఆందోళన కల్గిస్తోంది.

పోస్టర్‌లో ఆజాద్‌ను రాజకీయ ఊసరవెల్లి అని ఆరోపించారు ఉగ్రవాదులు. ఆయన ద్రోహి అని విధేయత అంటే ఏంటో తెలియదని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ముందస్తు ప్రణాళికతోనే కశ్మీర్ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నారు. తన గార్డులను మార్చడానికి ముందు ఆజాద్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమావేశమయ్యారని తెలిపారు.

కాగా.. కాంగ్రెస్‌తో 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని ఆ పార్టీకి కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేశారు ఆజాద్. రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కశ్మీర్‌లో సొంత రాజకీయ పార్టీ స్థాపిస్తానని ప్రకటించారు. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ.. తనకు ఆ ఆలోచన లేదని ఆజాద్ చెప్పారు.
చదవండి: పొలిటికల్‌ ట్విస్ట్‌.. పీకేతో నితీశ్‌ కుమార్‌ భేటీ

మరిన్ని వార్తలు