-

CM Shinde: షిండే అంకుల్‌.. సీఎం కావడం ఎలా? నన్ను గౌహతి తీసుకెళ్తావా?

19 Jul, 2022 09:27 IST|Sakshi

ముంబై: షిండే అంకుల్‌.. ముఖ్యమంత్రి కావడం ఎలా? అంటూ అమాయకంగా అడిగిన ఓ చిన్నారి ప్రశ్న ఇంటర్నెట్‌లో నవ్వులు పూయిస్తోంది. స్వయంగా మహారాష్ట్ర సీఎంనే కలిసి ఆ ప్రశ్న అడిగే సరికి.. ఆయన నవ్వుతూ బదులివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ముంబైలోని నందనవన్ బంగ్లాలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను కలిసింది అన్నడా దామ్రే అనే ఓ చిన్నారి. ‘మీలాగా సీఎం కావడం ఎలా? అస్సాంలో వరదలు వచ్చినప్పుడు, మీరు ప్రజలకు సహాయం చేయడానికి నీటిలో నడిచారు. మీలాగా వరద బాధిత ప్రజలను ఆదుకోవడం ద్వారా నేను ముఖ్యమంత్రిని కాగలనా? అంటూ అమాయకంగా ప్రశ్నించింది ఆ చిన్నారి. అంతేకాదు.. దీపావళి సెలవుల్లో తననూ గౌహతికి తీసుకెళ్లాలని సీఎం షిండేను అభ్యర్థించింది.  

దానికి సీఎం షిండే నవ్వుతూ.. నువ్వు ముఖ్యమంత్రి కచ్చితంగా అవుతావ్‌. అందుకోసం ఒక తీర్మానం కూడా పాస్‌ చేస్తాం అంటూ చెప్పారాయన. దీపావళికి గువాహతికి తీసుకెళ్తానని, అక్కడున్న కామాఖ్య గుడికి వెళ్దామా? అని అడిగారాయన.  దానికి అలాగే అనే సమాధానం ఇచ్చింది. ఈ చిన్నారి చాలా హుషారు అని షిండే అనడంతో.. అక్కడున్నవాళ్లంతా నవ్వారు. 

పోయిన నెలలో 39 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబావుటా ఎగరేసిన ఏక్‌నాథ్‌ షిండే.. గుజరాత్‌, అక్కడి నుంచి గువాహతి(అస్సాం)కు తరలివెళ్లారు. ఓ హోటల్‌లో బస చేసి సస్పెన్స్‌కు తెర లేపారు. ఎనిమిది రోజుల తర్వాత ముంబైకి చేరుకుని బీజేపీ మద్దతుతో ఏకంగా మహారాష్ట్రకే సీఎం అయ్యారు ఏక్‌నాథ్‌ షిండే.

మరిన్ని వార్తలు