ఒకరితో ఇష్టం లేని పెళ్లి.. తట్టుకోలేక ఆత్మహత్య

9 Feb, 2021 15:45 IST|Sakshi

భోపాల్‌: మార్కెట్‌లో ఓ సరుకు మాదిరి అమ్మాయిల జీవితం​ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ అమ్మాయిని ఏడు నెలల కాలంలో ఏడుసార్లు అమ్మకానికి పెట్టారు. ఆ ఏడుసార్లు ఒక్కొక్కరు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. చివరకు ఒకతను మానసిక దివ్యాంగుడు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అవమానంగా భావించిన ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. దీనికి కారకులైన 8 మందిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని జ‌ష్‌పూర్‌కు చెందిన ఓ 18 ఏళ్ల యువ‌తి తండ్రికి వ్య‌వ‌సాయ ప‌నుల్లో చేదోడుగా ఉండేది. అయితే ఆమె వ్య‌వ‌సాయ ప‌నులు చేయ‌డం ఇష్ట‌ం లేని ఓ బంధువు ఆమెకు మంచి ఉపాధి చూపిస్తాన‌ని చెప్పాడు. అనంతరం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఛ‌త్తార్‌పూర్‌కు తీసుకెళ్లింది. అక్క‌డ ఆమెను కిడ్నాప్ చేశారు. కిడ్నాప‌ర్లు ఆ యువ‌తి కుటుంబస‌భ్యుల‌కు ఫోన్ చేసి డ‌బ్బులు డిమాండ్ చేశారు. డ‌బ్వులు ఇవ్వ‌క‌పోతే చంపేస్తామ‌ని బెదిరించారు. దీంతో కుటుంబస‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వారు ద‌ర్యాప్తు చేప‌ట్టి ఇద్దరు కిడ్నాప‌ర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఛ‌త్తీస్‌గ‌ఢ్ నుంచి తీసుకెళ్లిన దంప‌తులే బెదిరింపులకు పాల్పడిన వారు కావడం గమనార్హం.

ఆ దంపతులు ఏడు నెల‌ల కిందట రూ. 20 వేల‌కు ఛ‌త్తార్‌పూర్‌కు చెందిన ఓ వ్య‌క్తికి ఆ అమ్మాయిని విక్రయించారు. అక్కడి నుంచి వేరొకరు.. అటు నుంచి ఇతరులు. ఇలా ఏడు నెల‌ల కాలంలో ఆమెను ఏడు మందికి విక్రయించారు. చివ‌ర‌కు ఉత్తరప్రదేశ్‌లోని ల‌లిత్‌పూర్‌కు చెందిన సంతోశ్‌ కుష్వాహాకు రూ. 70 వేల‌కు ఆ బాలికను విక్రయించారు. సంతోశ్‌ త‌న కుమారుడు బాబ్లూ కుష్వాహా (మాన‌సిక దివ్యాంగుడు)కు ఆ యువ‌తినిచ్చి బ‌ల‌వంతంగా పెళ్లి చేశాడు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురయి గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి మొత్తం 8మందిని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆ యువతి విషాద జీవితం గురించి తెలిపారు. 

>
మరిన్ని వార్తలు