కరోనా కేసుల్లో భారత్‌ రెండో స్థానం

24 Nov, 2020 17:51 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా 5.9 కోట్లకు చేరిన కేసులు

అమెరికాలో కోటి దాటిన కోవిడ్‌ కేసులు

91 లక్షల కేసులతో రెండో స్ధానంలో భారత్‌ 

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం అంటూ ప్రపంచ దేశాలు నివారణ చర్యలు చేపట్టినా కోవిడ్‌ కల్లోలం కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే సెకండ్ వేవ్ కూడా మొదలైంది. రికవరీ రేటు ఎలా ఉన్నా కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుదల మాత్రం ఆగడం లేదు. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5.9 కోట్లు దాటగా,13 లక్షల మంది మరణించినట్లు వాషింగ్టన్‌లోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్ఎస్ఇ) వారి తాజా నివేదిక ప్రకారం మంగళవారం నాటికి 59,128,645 కేసులు.. 1,395,658 మరణాలు సంభవించాయి.

ఇక అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు, మరణాల సంఖ్య పరంగా యూఎస్‌ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 1,24,14,292 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 2,57,651 మరణాలు సంభవించాయి. రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో 91,39,865 కరోనా కేసులు నమోదు కాగా, మరణించిన వారి సంఖ్య 1,33,738కు చేరుకుంది. మరణాల సంఖ్య ప్రకారం 169,485 బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది. పది లక్షకు పైగా కేసులు నమోదైన ఇతర దేశాల జాబితాలో బ్రెజిల్ (60,87,608), ఫ్రాన్స్ (21,95,940), రష్యా (20,96,749), స్పెయిన్ (15,82,616), యుకె (15,31,267), ఇటలీ (14,31,795), అర్జెంటీనా (13,74,631), కొలంబియా (12,54,979), మెక్సికో (10,49,358) ఉన్నాయి. (చదవండి: ‘కరోనా’ అంటే ఎందుకు భయం పోయింది?)
   

మరిన్ని వార్తలు