GOA New Rules: గోవాలో ఇకపై ఈ పనులు చేస్తే భారీగా జరిమానా

2 Nov, 2022 18:46 IST|Sakshi

పనాజీ: గోవా వెళ్లి స్నేహితులతో పార్టీ చేసుకోవాలని ప్లాన్‌ చేసుకుంటున్నారా? అయితే, ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. గోవాలో పర్యటకాన్ని మరింత బలోపేతం చేసే దిశగా, టూరిస్టు ప్రాంతాలు పరిశుభ్రంగా, సురక్షితంగా ఉండేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. ఆయా నిబంధనలను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు అక్టోబర్‌ 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. 

‘ఓ వ్యక్తి, కంపెనీ, సంఘం, సంస్థ ఏదైనా నిబంధనలు ఉల్లఘిస్తే రూ.5000 జరిమానా విధిస్తాం. ఆ ఫైన్‌ రూ.50,000 వరకు సైతం ఉండవచ్చు. ఐపీసీలోని సెక్షన్‌ 188 ప్రకారం చర్యలు ఉంటాయి.’ అని గవర్నమెంట్‌ ఆర్డర్‌లో పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం బీచ్‌లోని బహిరంగ ప్రదేశాల్లో వంట చేయటం, డ్రైవింగ్‌ వంటివి నిషేదం. బీచ్‌లో చెత్త పారవేయటం, మద్యం బాటిళ్లను పగలగొడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.

కొద్ద నిబంధనలు ఇలా.. 
 ఇకపై బీచ్‌లో డ్రైవింగ్‌ చేయకూడదు. బహిరంగ ప్రదేశంలో వంట వండటం నిషేదం.

► బీచ్‌లో చెత్త వేయటం, తాగి పడేసే బాటిళ్లను పగలగొట్టటం నేరం.

► టూరిస్టులతో పాటు వారికి సేవలందిస్తున్న వివిధ సంస్థలు, వ్యాపారస్తులకు సైతం కొత్త నిబంధనలు వర్తిస్తాయి. 

► వాటర్‌ స్పోర్ట్స్‌ కేవలం గుర్తింపు పొందిన ప్రాంతాల్లోనే నిర్వహించాలి. 

► టికెట్ల జారీ గుర్తింపు పొందిన కౌంటర్ల వద్దే నిర్వహించాలి. బహిరంగంగా టికెట్లు జారీ చేయకూడదు. 

► తోపుడి బండిపై వ్యాపారం చేసే వారు పర్యటకులకు అడ్డుపడితే జరిమానా పడుతుంది. 

► ఎవరైనా టూరిస్టులను డబ్బులు అడగడం, అల్లర్లు సృష్టించటం చేస్తే చర్యలు తప్పవు.

► నిబంధనలను అతిక్రమించిన వారికి రూ.5వేల నుంచి రూ.50వేల వరకు జరిమానా విధించనున్నారు.

ఇదీ చదవండి: పీఎంగా రిషి సునాక్‌ తొలిసారి బిగ్‌ యూ-టర్న్‌.. ఆ నిర్ణయంలో మార్పు

మరిన్ని వార్తలు