Goa Lockdown: గోవాలో లాక్‌డౌన్‌

1 May, 2021 05:56 IST|Sakshi

పణజీ/చండీగఢ్‌: కరోనా టెస్టు పాజిటివిటీ రేటు 50 శాతాన్ని మించడంతో గోవా ప్రభుత్వం నాలుగు రోజుల లాక్‌ డౌన్‌ ప్రకటించింది. ప్రజలెవరూ బయటకు రావద్దని సూచిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 16 లక్షల జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరుగుతుండంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గురువారం 5,910 శాంపిళ్లను పరీక్షించగా అందులో ఏకంగా 3,019 శాంపిళ్లకు పాజిటివ్‌గా తేలడంతో లాక్‌ డౌన్‌ మార్గాన్ని ఎంచుకుంది. గురువారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రకటించింది. వీక్లీ మార్కెట్లు కూడా అందుబాటులో ఉండబోవని ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ వెల్లడించారు. అత్యవసర విభాగాలన్నీ యథావిధిగా పని చేస్తాయని చెప్పింది. పలు ప్రముఖ బీచ్‌లు లాక్‌ డౌన్‌ కారణంగా బోసిపోయి కనిపించాయి.

హరియాణాలో వీకెండ్‌ లాక్‌ డౌన్‌
కరోనాను కట్టడి చేసేందుకు హరియాణా ప్రభుత్వం కూడా లాక్‌ డౌన్‌ బాటను ఎంచుకుంది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో వీకెండ్‌ లాక్‌ డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి లాక్‌ డౌన్‌ అమల్లోకి వస్తుందని, సోమవారం ఉదయం 5 గంటల వరకూ అది కొనసాగుతుందని ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ వెల్లడించారు. కరోనా రెండో సారి పంజా విసురుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. లాక్‌ డౌన్‌ లో ప్రజలంతా ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరింది.

ఇక్కడ చదవండి:
రెండోవేవ్‌: అక్కడ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా లేదు!

ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రో సెగ

మరిన్ని వార్తలు