కోవీషీల్డ్‌ డోసుల గ్యాప్‌: పూనావాలా స్పందన

13 May, 2021 20:48 IST|Sakshi

మంచి, శాస్త్రీయమైన నిర్ణయం : సీరం సీఈవో అదార్‌ పూనావాలా

సాక్షి, న్యూఢిల్లీ: కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ మోతాదుల మధ్య అంతరాన్ని పెంచడంపై సీరం సీఈఓ అదార్ పూనావాలా సానుకూలంగా స్పందించారు. కోవిషీల్డ్  వ్యాక్సిన్లను పుణేకు చెందిన అతిపెద్ద వ్యాక్సిన్‌ సంస్థ సీరం ఉత్పత్తి చేస్తోంది. తాజాగా వ్యాక్సిన్ డోసుల మధ్య విరామ కాలాన్ని ప్రస్తుతమున్న ఆరు నుంచి 8 వారాల నుంచి 12-16 వారాలకు పెంచడం మంచి నిర్ణయమని  ఆదార్ పూనావాలా అన్నారు.  టీకా సమర్థత, ఇమ్యునోజెనిసిటీ దృక్కోణంలో చూస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.(మొదటి డోస్‌ తర్వాత కరోనా వస్తే.. వ్యాక్సిన్‌ ఎపుడు తీసుకోవాలి!)

టీకా  సామర్థ్యాన్ని, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందని, ఈ నిర్ణయం శాస్త్రీయంగా సరైందని పూనావల్లా చెప్పారు. పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ నిర్ణయం కోవిషీల్డ్ ఉత్పత్తిపై పడే ఒత్తిడిని తగ్గిస్తుందని అన్నారు. మరింత ఎక్కువమంది ప్రజలు మొదటి డోసును తీసుకోవడానికి కూడా ఇది ఉపకరిస్తుందని అంచనా.

మొదట్లో రెండు డోసుల మధ్య విరామం నాలుగు నుంచి ఆరు వారాలు ఉండాలని నిర్దేశించారు. ఆ తరువాత అది 6 నుంచి 8 వారాలకు పెరిగింది. అయితే ఇటీవలి అధ్యయనం ప్రకారం రెండు డోసుల మధ్య  అంతరం 12 నుంచి అంతకంటే ఎక్కువ విరామంలో ఇచ్చిన రెండు ప్రామాణిక మోతాదుల తరువాత టీకా సామర్థ్యం 81.3 శాతంగా ఉంది. 6 వారాల కన్నా తక్కువ ఉంటే ఇది 55.1 శాతం ఉంటుందని వెల్లడైంది.

అదే బ్రిటన్ నుంచి అందిన ఆధారాల ప్రకారం ఈ విరామ కాలాన్ని పెంచేందుకు కోవిడ్ వర్కింగ్ గ్రూప్ అంగీకరించిందని  సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ల మధ్య గ్యాప్‌ పెంచడం ద్వారా టీకా సామర్థ్యం పెరుగుతుందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ సౌమ్య స్వామినాథన్ గత ఫిబ్రవరిలోనే  వెల్లడించిన సంగతి తెలిసిందే.

చదవండి : 
గుడ్ న్యూస్: స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి
కరోనా: సీనియర్‌ వైద్యుల మూకుమ్మడి రాజీనామా

మరిన్ని వార్తలు