ఇదేందయ్యా ఇది.. ఇది నేను చూడలా!

13 Jan, 2021 14:50 IST|Sakshi

ఫోటోషాప్‌ మాస్క్‌.. ట్రోలింగ్‌కు గురైన పోలీసులు

ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ పోలీసులు ప్రస్తుతం ట్విటర్‌లో తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ఇందుకు ఓ నిందితుడితోపాటు అతన్ని పట్టుకున్న పోలీసు ఉన్న ఫోటోకు ఫోటోషాప్‌ ద్వారా ముఖానికి మాస్కు ధరించినట్లు మార్పింగ్‌ చేయటమే కారణం. వివరాల్లోకి వెళితే.. భూ వివాద గొడవలో సొంత సోదరుడిని హతమార్చినందుకు గోరఖ్‌పూర్‌ జిల్లా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ నిందితుడిని పట్టుకున్న ఓ ఫోటోను తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరికి కూడా మాస్క్‌ లేదు. ఇది గుర్తించిన నెటిజన్లు కరోనా ప్రోటోకాల్‌ను పోలీసులు పాటించడం లేదని విమర్శలు గుప్పించారు. దీంతో ఈ పోస్టును పోలీసులు వెంటనే తొలగించారు. చదవండి: ‘నేను ఎవరికీ ఇష్టం లేదు.. బతకాలని లేదు’

తరువాత ఇదే ఫోటోను ఫోటోషాప్‌లో ఎడిట్‌ చేసి రీ పోస్టు చేశారు. ఇందులో అరెస్టు అయిన నిందితునితో పాటు పోలీసు ముఖానికి మాస్కు ధరించినట్లు ఫోటోను మార్ఫింగ్‌ చేశారు. దీనిని మళ్లీ ట్విటర్‌లో పోస్టు చేశారు. అయితే అంతకుముందు షేర్ చేసిన ఫొటోను, ఈ ఫొటోను చూసిన నెటిజన్లు పోలీసులను పదే పదే ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘డిజిటల్‌ మాస్క్‌@ గోరఖ్‌పూర్‌ పోలీసులు, మీలాగా డిజిటల్‌ ఇండియాను ప్రోత్సహించడం నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌’ అంటూ చురకలంటించారు. ఇట్లాంటి జిమ్మిక్కులు ఎప్పుడూ చూడలేని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తప్పిదాన్ని గ్రహించిన పోలీసులు ఆ ఫొటోను వెంటనే తొలగించారు. అయితే అప్పటికే ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు