మరో ఝలక్‌ : చైనా యాప్‌లపై నిషేధం

24 Nov, 2020 18:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ సమగ్రతకు భద్రతకు ముప్పు అంటూ ఇప్పటికే భారీగా చైనా యాప్‌లపై వేటు వేసిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 43  చైనా మొబైల్ యాప్‌లను తాజాగా  నిషేధించింది. మాంగో టీవీ, అలీసప్లయర్స్ మొబైల్ యాప్, అలీబాబా వర్క్‌బెంచ్ ,క్యామ్‌కార్డ్, అలీఎక్స్‌ప్రెస్ లాంటివి ఇందులో ఉన్నాయి. ఈ మేరకు సమాచార మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని, చట్టవిరుద్ద కారక్రమాలల్లో పాలు పంచుకుంటున్నారన్న సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సమగ్ర నివేదికల ఆధారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 ఏ కింద ఈ చర్య తీసుకున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటీవీ (టీవీ వెర్షన్) వీటీవీ సిడ్రామా, కెడ్రామా అండ్‌ మోర్, వీటీవీ లైట్ భారతదేశంలో నిషేధించబడిన యాప్‌లలో ఉన్నాయి. వీటితోపాటు విడేట్, సింగోల్, ట్రూలీ చైనీస్, ట్రూలీ ఏషియన్, చైనాలోవ్, డేట్‌మైజ్, ఏషియన్ డేట్, ఫ్లిర్ట్‌విష్, గైస్ ఓన్లీ డేటింగ్, రెలా తదితర డేటింగ్ యాప్‌లను బ్లాక్‌ చేసింది. ప్రధానంగా జనాదరణ పొందిన షాపింగ్ వెబ్‌సైట్ అలీఎక్స్‌ప్రెస్‌కు కూడా నిషేధించింది.. చైనీస్ ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబాకు ఇది పెద్ద ఎదురు దెబ్బ.

తూర్పు లడఖ్‌లోని దేశసరిహద్దు ప్రాంతం వద్ద  చైనా దుశ్చర్య, ఉద్రిక్తతల మధ్య పలు యాప్‌లపై కొరడా ఝళిపించింది. ఈ  ఏడాది జూన్‌ 29న  59 యాప్‌లను, సెప్టెంబర్ 2న మరో 118 చైనా యాప్‌లను నిషేధించింది. వీటిలో ప్రముఖ చైనాయాప్‌లు టిక్‌టాక్, షేర్‌ఇట్‌, హెలో, షెయిన్, లైక్, వీచాట్, యుసి బ్రౌజర్‌ లాంటివి ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు