వ్యాక్సిన్‌లకు అత్యవసర అనుమతి!

23 Nov, 2020 05:37 IST|Sakshi

అవకాశాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రణకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కొన్ని కంపెనీల క్లినికల్‌ ట్రయల్స్‌ ముగింపు దశకు చేరాయి. తమ వ్యాక్సిన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఫైజర్, మోడెర్నా వంటి దిగ్గజ ఫార్మా సంస్థలు ప్రకటించాయి. వ్యాక్సిన్‌ రాగానే ఉపయో గించాలంటే ప్రభుత్వం అత్యవసర అనుమతి (ఎమర్జెన్సీ ఆథరైజేషన్‌) ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాక్సిన్‌లకు ఇలాంటి అనుమతి ఇవ్వడానికి అందుబాటులో ఉన్న విధానాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌ (వీటీఎఫ్‌) ఈ పనిలో నిమగ్నమై ఉంది.

మోడెర్నా టీకా డోసు ధర ఎంతంటే..
ఫ్రాంక్‌ఫర్ట్‌: కరోనా టీకా అభివృద్ధిలో అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా ముందంజలో ఉంది. త్వరలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని నమ్మకంగా చెబుతోంది. ఆ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ స్టెఫానీ బాన్సెల్‌ మాట్లాడుతూ తమ వ్యాక్సిన్‌కుగాను ప్రభుత్వాల నుంచి ఒక్కో డోసుకు 25 డాలర్ల నుంచి 37 డాలర్లు(రూ.1,854–రూ.2,744) తీసుకుంటామని చెప్పారు. ఆర్డర్‌ చేసిన డోసులను బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుంద న్నారు. ఫ్లూ వ్యాక్సిన్‌ డోసు 10 డాలర్ల నుంచి 50 డాలర్ల దాకా పలుకుతోంది. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) అధికారులు ఇప్పటికే మోడెర్నా సంస్థతో చర్చలు జరిపారు. వ్యాక్సిన్‌ డోసు 25 డాలర్ల లోపు ధరకే తమకు సరఫరా చేయాలని కోరారు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదు.

మరిన్ని వార్తలు