ముంబై-హైదరాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ డీపీఆర్‌పై కసరత్తు

28 Oct, 2020 15:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముంబై-పుణే-హైదరాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)పై కసరత్తు సాగించేందుకు నవంబర్‌ 5న ప్రీ బిడ్‌ సమావేశం ఏర్పాటు చేశారు. 711 కిలోమీటర్ల హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌పై సర్వే, ఉపరితలం,అండర్‌గ్రౌండ్‌ సదుపాయాలు, సబ్‌స్టేషన్లకు విద్యుత్‌ సరఫరా వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ముంబై-పుణే-హైదరాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌కు టెండర్లను నవంబర్‌ 18న తెరుస్తారు.

టెండర్‌లో విజయవంతమైన బిడ్డర్‌ను గుర్తించి టెండర్‌ను ఖరారు చేస్తారు. ఇక ప్రభుత్వం మొత్తం ఏడు రూట్లలో బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్లను అభివృద్ధి చేయాలని గుర్తించింది. ముంబై-పుణే-హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ-లక్నో-వారణాసి, ముంబై-నాసిక్‌-నాగపూర్‌, ఢిల్లీ-జబల్పూర్‌-అహ్మదాబాద్‌, చెన్నై-మైసూర్‌, ఢిల్లీ-చండీగఢ్‌-అమృత్‌సర్‌, వారణాసి-పాట్నా-హౌరా రూట్లలో బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌లను అభివృద్ధి చేయనున్నారు. దేశంలో ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లపై సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)లను తయారు చేసే బాధ్యతను రైల్వే మంత్రిత్వ శాఖ నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌)కు అప్పగించింది. చదవండి : భూకంపంలోనూ నడిచే బుల్లెట్‌ ట్రైన్‌!

మరిన్ని వార్తలు