పెన్షనర్ల లైఫ్‌ సర్టిఫికెట్‌కు ఫేస్‌ రికగ్నేషన్‌ టెక్నాలజీ

30 Nov, 2021 06:05 IST|Sakshi

న్యూఢిల్లీ: వృద్ధాప్యం మీదపడుతున్న పెన్షనర్లు సుదూరంలోని సంబంధిత కార్యాలయాలకు తాము నేరుగా వచ్చి లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి వచ్చేది. అలాంటి వారికి లైఫ్‌ సర్టిఫికెట్‌ విషయంలో ఎంతగానో సాయపడే కొత్త రకం ఫేస్‌ రికగ్నేషన్‌ సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చింది. ప్రతీ సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా సంబంధిత ప్రభుత్వ శాఖకు సమర్పించాల్సిన లైఫ్‌ సర్టిఫికెట్‌కు ఇకపై ఒక సాక్ష్యంగా పనికొచ్చే ‘యునీక్‌’ ఫేస్‌ రికగ్నేషన్‌ టెక్నాలజీని పెన్షన్ల శాఖ కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ సోమవారం ప్రారంభించారు. పెన్షనర్ల లైఫ్‌ సర్టిఫికెట్‌ను డిజిటల్‌ రూపంలో ఇచ్చేందుకు ఇప్పటికే కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ ఒక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ‘యునీక్‌’ ఫేస్‌ రికగ్నేషన్‌ టెక్నాలజీ వారికి మరింతగా ఉపయోగపడనుందని మంత్రి చెప్పారు. 68 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతోపాటు ఈపీఎఫ్‌వో, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వారికీ ఈ టెక్నాలజీ సహాయకారిగా ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు