సిమ్లాలో గవర్నర్‌ దత్తాత్రేయ దంపతులు

4 Feb, 2021 19:59 IST|Sakshi

సిమ్లా: చలికాలం కావడంతో ప్రస్తుతం మంచు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలు మంచు దుప్పటిలో మునిగిపోయాయి. మంచుతో నిండిన ఆ ప్రాంతాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఓ మంచు ప్రాంతం గవర్నర్‌గా ఉన్న తెలంగాణ వ్యక్తి ఎంజాయ్‌ చేస్తున్నారు. మంచు ప్రాంతాల్లో పర్యటించి అందాలను ఆస్వాదించారు. ఆయనే హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ.

హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా ప్రాంతం భారీ ఎత్తున మంచు దుప్పటి కప్పేసింది. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తన సతీమణి వసంతతో కలిసి మంచు ప్రాంతాల్లో కలియ తిరిగారు. రాజ్ భవన్ ఆవరణలోనే కురిసిన మంచును పరిశీలించారు. హిమ ఫలకాలను పట్టుకుని ఎగురవేశారు. చిన్నపిల్లాడి మాదిరి గవర్నర్‌ ఆ మంచుతో ఆడుకున్నారు. ఆయన వెంట రాజ్‌భవన్‌ అధికారులు, సిబ్బంది కూడా ఉన్నారు.

హిమపాతం ప్రకృతి ఇచ్చిన వరంగా ఈ సందర్భంగా దత్తాత్రేయ కొనియాడారు. ఇది కచ్చితంగా సానుకూల శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు. హిమపాతం పండ్ల తోటలకు ఎరువుగా ఉపయోగపడుతుందని, రాబోయే కాలంలో మంచి దిగుబడికి ఇది సహాయపడుతుందని తెలిపారు. ఈ క్రమంలో మంచు కురుస్తుండడంతో అధికారులకు జాగ్రత్తలు సూచించారు. ప్రజలు ఎటువంటి అసౌకర్యాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ దత్తాత్రేయ అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు