ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ బాధ్యతలొద్దు

13 Mar, 2021 05:50 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల కమిషనర్లుగా నియమించొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అదనపు బాధ్యతలు ఒక ప్రభుత్వ అధికారికి అప్పగించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించింది. మార్‌గోవా, మాపుసా, మార్ముగోవా, సంగెం, క్వీపెం మున్సిపల్‌ ఎన్నికలకు గోవా ఎన్నికల కమిషనర్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ గోవా ప్రభుత్వం దాఖలు చేసిన  పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారీమన్, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ హృషీకేష్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. 

చట్ట ప్రకారం మహిళలకు వార్డులు కేటాయించకపోవడంతో సదరు 5 మున్సిపాల్టీల్లో ఎన్నికలు నిర్వహించొద్దని హైకోర్టు ఆదేశించింది.  హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, ఈ సందర్భం గా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను రాజీ చేయలేమని, ఎన్నికల కమిషనర్లు స్వతంత్ర వ్యక్తులుగా ఉండాలని, ప్రభుత్వం లో పదవిలో ఉన్న వ్యక్తిని ఏ రాష్ట్రాలూ ఎన్నికల కమిషనర్‌గా నియమించజాలవని పేర్కొంది. ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యక్తి గోవాలో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించడం బాధాకరమై న అంశమని ధర్మాసనం అభిప్రాయ పడింది.

మరిన్ని వార్తలు