న్యూఢిల్లీ: దేశ రైతాంగానికి ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. డీఏపీ బస్తాపై ప్రస్తుతం అందుతున్న రూ.500ల సబ్సిడీని రూ.1200లకు పెంచుతున్నట్లు ప్రకటన విడుదల చేశారు. దీంతో ఓ బస్తా డీఏపీపై 140 శాతం సబ్సిడీ లభించనుంది. ఎరువుల ధరపై బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల ఉన్నప్పటికీ రైతు అతి తక్కువ ధరకే ఎరువులు పొందాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని ప్రధాని వెల్లడించారు. కాగా, సవరించిన సబ్సిడీ ధరలతో కేంద్ర ప్రభుత్వంపై రూ.14,775 కోట్ల అదనపు భారం పడనుంది.