తప్పంతా మీదే.. ముందు చూపు లేకుండా వ్యాక్సినేషన్‌

22 May, 2021 09:08 IST|Sakshi

సీరమ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సురేశ్‌ జాదవ్‌

సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలకు టీకాలు అందించే విషయంలో ప్రభుత్వం ముందు చూపు లేకుండా వ్యవహరించడం వల్లనే వ్యాక్సిన్ల కొరత సమస్య ఎదురైందని  సీరమ్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సురేశ్‌ జాదవ్‌ ఆరోపించారు. హీల్‌హెల్త్‌ సంస్థ నిర్వహించిన సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్రం తొలుత మూడు కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు వ్యాక్సిన్లు ఇవ్వాలని నిర్ణయించింది.

దానికి తగ్గట్టే మేము ప్రభుత్వానికి 6 కోట్ల డోసుల టీకాలు సరఫరా చేశాం. ఆ తర్వాత మమ్మల్ని సంప్రదించకుండానే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. కోవీషీల్డ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తి పరిమితమే అని తెలిసి కూడా 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లకు... టీకాలు తీసుకుంటున్న జనాలకు మధ్య పొంతన లేకుండా పోయింది. దాని ఫలితమే నేడు టీకాల కొరతకు దారి తీసింది’ అన్నారు. 

గుణపాఠం
ప్రస్తుతం ఎదుర్కొంటున్న వ్యాక్సిన్ల కొరత మనకో గుణపాఠం లాంటిందన్నారు సురేశ్‌​ జాదవ్‌.  ఉత్పత్తి సామర్థ్యం,  నిల్వల ఆధారంగా వ్యాక్సినేషన్‌ చేయడం సరైన పద్దతని అన్నారు. దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్నినియమాలు రూపొందించింది. వాటిని పాటించాలన్నారు. ఇక కరోనాను ఎదుర్కొవాలంటే టీకా ఒక్కటే పరిష్కారమని తెలిసి కూడా కొందరు వ్యాక్సినేషన్‌ చేయించుకోమంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ అంటూ సందేహాలు వ్యక్తం చేస్తుంటారని సురేశ్‌ జాదవ్‌ విస్మయం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు