స్విగ్గీ, జొమాటోతో టీకా డెలివరీ!

9 Oct, 2020 04:05 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ మరో కొద్ది నెలల్లో భారత్‌లో అందుబాటులోకి రావచ్చనే అంచనాల నేపథ్యంలో టీకా పంపిణీకి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీకా డోసుల్ని ఉంచడానికి దేశవ్యాప్తంగా కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించే పనిలో పడింది. దీనికి సంబంధించి జాతీయ నిపుణుల కమిటీ ఫార్మాసూటికల్, ఆహార రంగాలలో ఉన్న కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ స్టార్టప్‌లతో ఒప్పందాలు కుదర్చుకొని తాలూకా స్థాయిలో వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

టీకా డోసుల పంపిణీకి సంబంధించి ఒక ముసాయిదా ప్రణాళికను వచ్చేవారంలో విడుదల చేయనున్నట్టుగా ఆ వర్గాలు తెలిపాయి. భారత్‌ తాను సొంతంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌తో పాటు 3 విదేశీ వ్యాక్సిన్లు మరి కొద్ది నెలల్లో అందుబాటులోకి రావచ్చు. వ్యాక్సిన్‌ డోసుల్ని ఉంచడానికి మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత గల కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు అవసరం. కేంద్ర ఆరోగ్య శాఖ భారీ కోల్డ్‌ స్టోరేజ్‌లను రెండు నెలల పాటు వాడుకోవడానికి వీలుగా వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది.

>
మరిన్ని వార్తలు