ఒకట్రెండు రోజుల్లో మూడో దశ పరీక్షలు షురూ

18 Aug, 2020 18:07 IST|Sakshi

భారీగా పెరిగిన రికవరీలు

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో అభివృద్ధి చెందుతున్న మూడు కరోనా వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉండగా, వాటిలో ఒక వ్యాక్సిన్‌ ఒకట్రెండు రోజుల్లో మూడవ దశ పరీక్షలకు చేరుకుంటుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు. కరోనా వ్యాక్సిన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రజలకు ఇచ్చిన భరోసాకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. మరోవైపు సోమవారం దేశంలో అత్యధికంగా 9 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 3,09,41,264 పరీక్షలు జరిపినట్టు తెలిపింది.

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 57,584 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారని, ఇదే సమయంలో వ్యాధి బారినపడిన 55,079 మంది కంటే రికవరీలు అధికంగా ఉన్నాయని పేర్కొంది. దేశంలో​ యాక్టివ్‌ కేసుల కంటే కోలుకున్న రోగులు మూడు రెట్లు అధికంగా ఉన్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 నుంచి 19.77 లక్షల మంది కోలుకున్నారని వెల్లడించారు. కరోనా మరణాల రేటు కూడా 2 శాతం లోపే ఉందని, రాబోయే రోజుల్లో దీన్ని ఒక శాతానికి తగ్గించే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కాగా మహమ్మారి నుంచి కోలుకున్న రోగుల్లో కోవిడ్‌ అనంతర లక్షణాలపై శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కాగా, భారత్‌ బయోటెక్‌, జైడస్‌ క్యాడిల్లా, సీరం ఇనిస్టిట్యూట్‌లు కరోనా వైరస్‌ నిరోధానికి దేశీ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడం​లో తలమునకలయ్యాయి. చదవండి : సగం పనిచేసే వ్యాక్సిన్‌ వచ్చినా చాలు

మరిన్ని వార్తలు