భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నాడని సస్పెండ్‌ చేశారు..!

3 Dec, 2022 17:40 IST|Sakshi

రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నందుకు ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్‌చేశారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌ బార్వానీ జిల్లాలో రాహుల్‌గాంధీ నేతృత్వంలో భారత్‌ జోడో యాత్రకు హాజరైనందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాజేష్‌ కన్నోజే సస్పన్షన్‌కి గురయ్యాడు. ఆయన కనాస్యలోని రాష్ట్ర గిరిజన వ్యవహార విభాగంలో ఒక ప్రాథమిక పాఠశాల్లోని ఉపాధ్యాయుడు. అతను యాత్రలో పాల్గొన్న ఒకరోజు తర్వాత ప్రవర్తన నియమాలు ఉల్లంఘించారంటూ అధికారులు సస్పెండ్‌ చేశారు.

అతని సస్పెన్షన్‌ ఉత్తర్వులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు గిరిజన వ్యవహారాల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ రఘవన్షి మాట్లాడుతూ...కన్నోజే ముఖ్యమైన పని కోసం సెలవు కోరారు. కానీ అతను రాజకీయ కార్యక్రమానికి హాజరై సోషల్‌మీడియాలో ఫోటోలు పోస్ట్‌ చేశాడు. ఆయన నవంబర్‌ 24న ఒక రాజకీయ పార్టీ భారత్‌ జోడో యాత్రకు హాజరై ప్రవర్తన నియమాలు ఉల్లంఘించారు. అదువల్లేఈ వేటు విధించినట్లు తెలిపారు.

దీంతో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ మీడియా డిపార్ట్‌మెంట్‌ చైర్‌పర్సన్‌ కెకె మిశ్రా ట్విట్టర్‌ వేదికగా....శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ ప్రభుత్వం ఉద్యోగులను రాష్ట్ర స్వయం సేవక్‌ సంఘం(ఆర్‌ఎస్‌ఎస్‌) శాఖలలో మాత్రమే పాల్గొనడానికి అనుమతించిందని ఎద్దేవా చేశారు. రాజేష్‌ కన్నోజ్‌ అనే గిరిజనుడు ఆ యాత్రలో పాల్గొని రాహుల్‌కి విల్లు, బాణం బహుమతిగా ఇచ్చినందుకే ఆయనపై వేటు వేశారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం రాహుల్‌ జోడో యాత్ర ఈ ఆదివారం రాజస్తాన్‌లోకి ప్రవేశించనుంది. 

(చదవండి: బెంగాల్‌లో ముందస్తు ఎన్నికలు.. హింట్‌ ఇచ్చిన బీజేపీ!)

>
మరిన్ని వార్తలు