చిలుకను తెచ్చిచ్చినందుకు రూ.85 వేల నజరానా

24 Jul, 2022 02:45 IST|Sakshi
 శ్రీనివాస్‌కు నగదు ఇస్తున్న అర్జున్‌   

తుమకూరు: ఇంట్లో ఎంతో అపురూపంగా పెంచుకునే కుక్కలు, పక్షులు వంటి జంతువులు తప్పిపోతే వాటి యజమానుల బాధ వర్ణనాతీతం. పగలూ రేయి నిద్రాహారాలు మానేసేవారు ఉన్నారు. అదే కోవకు చెందిన ఓ యజమాని తప్పిపోయిన చిలుకను తెచ్చిచ్చిన వ్యక్తికి రూ.85 వేల బహుమానాన్ని అందించాడు. ఈ సంఘటన కర్ణాటకలోని తుమకూరు నగరం జయనగరలో జరిగింది. అర్జున్‌ అనే వ్యక్తి అరుదైన 2 ఆఫ్రికన్‌ బూడిద రంగు రామచిలుకలను ఇంట్లో పెంచుకుంటున్నాడు.

వాటికి ఏటా ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరిపేవాడు. వారం కిందట అందులోని ఒక చిలుక ఎగిరిపోయింది. దీంతో అర్జున్‌ చిలుకను పట్టిస్తే రూ.50 వేల నజరానా ఇస్తానని పోస్టర్లు వేయించాడు. ఫలితం లేకపోవడంతో ఆ బహుమానాన్ని రూ. 85 వేలకు పెంచాడు. శుక్రవారం సాయంత్రం శ్రీనివాస్‌ అనే వ్యక్తి బుట్టలో చిలుకను తీసుకువచ్చి అర్జున్‌కు ఇచ్చాడు. రోడ్డుపై పడి ఉంటే ఇంటికి తీసుకెళ్లి పరిచర్యలు చేశానని పోస్టర్లను చూసి మీ దగ్గరకు పట్టుకువచ్చానని అర్జున్‌కు చెప్పాడు. దీంతో మాట ప్రకారం శ్రీనివాస్‌కు రూ.85 వేల నగదును అర్జున్‌ అందజేశాడు. 

>
మరిన్ని వార్తలు