వధువును భుజాలపై ఎత్తుకొని నదిని దాటిన వరుడు.. వైరల్‌ వీడియో

30 Jun, 2021 19:14 IST|Sakshi

పట్నా: భారతీయ వివాహంలో సంప్రదాయం ప్రకారం అమ్మాయి మెడలో మూడు ముళ్లు పడగానే ఆమె ఇక తనలో సగభాగం అని భర్త భావిస్తాడు. ఆమెకు ఏం కష్టమొచ్చినా తానే ముందుండి నిలబడాలంటూ భర్తను అగ్నిసాక్షిగా ప్రమాణం చేయిస్తారు. తాజాగా బిహార్‌లో పెళ్లికూతురును తన భుజాలపై ఎత్తుకొని వరుడు నది దాటిన వీడియో వైరల్‌గా మారింది. వివరాలు.. బిహార్‌లోని కిసాన్‌గంజ్‌ జిల్లాకు చెందిన శివకుమార్‌ సింగ్‌కు  ఉన్న పక్కనే ఉన్న పల్సా గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది.

అయితే వీరువరి గ్రామాలు కంకై నది తీరానికి అటుపక్క.. ఇటుపక్కగా ఉంటాయి. ఇరు గ్రామాల మధ్య రాకపోకలు సాగాలంటే కంకై నదిని దాటి వెళ్లాల్సిందే. కాగా యువతిని పెళ్లి చేసుకున్న శివకుమార్‌ తన బంధువులతో కలిసి పడవలో తన సొంత గ్రామానికి బయలుదేరాడు. ఇంకా కొంతదూరం వెళితే ఊరికి చేరతామని అనుకుంటున్న తరుణంలో వారి పడవ ఇసుకలో కూరుకుపోయి ఆగిపోయింది. దీంతో శివకుమార్‌ సహా ఇతర బంధువులు పడవ దిగారు. వారితో పాటే పెళ్లికూతురు కూడా దిగే ప్రయత్నం చేయగా.. వరుడు శివకుమార్‌ వద్దని వారించి.. ఆమెను తన భుజాలపై ఎత్తుకొని ఆమెను మోసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఈ పరిణామంతో పెళ్లికూతురు సిగ్గుతో ముసిముసినవ్వులు నవ్వగా.. శివ కుమార్‌ బంధువులు వారిద్దరిని ఉత్సాహపరుస్తూ వచ్చారు.

దీనిపై వరుడు శివకుమార్‌ స్పందిస్తూ.. ' కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేదు. అందుకే ఎంత కష్టమైన ఆమెను నా భుజాలపై ఇంటివరకు మోసుకెళ్లాను. చూసేవారికి ఇది ఆనందంగా కనిపించొచ్చు. కానీ మా బాధలు వర్ణణాతీతం. ఇలాంటి ఘటనలు రోజు చూస్తూనే ఉన్నాం. పదేళ్ల క్రితం నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం కంకై నదీ తీరానికి బ్రిడ్జి కడతామని హామీ ఇచ్చింది. అప్పటినుంచి ఏనాటికైనా బ్రిడ్జి కట్టకపోతారా అనే ఆశతోనే బతుకుతున్నాం.ఈ పదేళ్లలో ఎన్నో పడవ ప్రమాదాలు చోటుచేసుకొని ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఎంతలా ఉందో మా ఆవేదన చూస్తే మీకు అర్థమవుతుంది'' అంటూ చెప్పుకొచ్చాడు. 

చదవండి: ప్రిన్సెస్‌ డయానా కారు వేలం; వామ్మో అంత ధర!

>
మరిన్ని వార్తలు