మంటపంలో వరుడు.. పరారీలో వధువు

17 Dec, 2020 13:18 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి కుమారుడు ఊరేగింపుగా తన ఇంటి నుంచి వివాహ మంటపానికి చేరుకున్నాడు. కానీ పెళ్లి కుమార్తె కనిపించకుండా పోయింది. ఆమె కోసం ఓ రోజంతా ఎదురు చూసి.. చుట్టుపక్కలా అంతా వెతికి.. చివరకు కోపంతో ఇంటి బాట పట్టాడు. ఆ వివరాలు అజాంగఢ్‌ కొత్వాలి ప్రాంతం కాన్షి రాం కాలనీకు చెందిన యువకుడికి.. పక్క గ్రామం యువతితో వివాహం నిశ్చయమయ్యింది. ఇరు కుటుంబాల మధ్య ఓ మహిళ ఈ వివాహ ప్రతిపాదన తీసుకువచ్చింది. రెండు కుటుంబాలకు అంగీకారం కావడంతో ఈ నెల 10న వీరిద్దరికి వివాహం నిశ్చయించారు. ఈ నేపథ్యంలో 10వ తేది రాత్రి యువకుడు బరాత్‌గా పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. ఎంతో సంతోషంగా మంటపానికి చేరుకున్న వరుడికి షాక్‌ తగిలింది. వధువు కనిపించడం లేదనే వార్త వినిపించింది. దాంతో ఆమె కోసం చుట్టుపక్కల మొత్తం వెదికారు. కానీ వధువు ఆచూకీ లభ్యం కాలేదు. (చదవండి: ప్రపంచపు అత్యుత్తమ వరుడు.. వధువు కోసం)

ఆమె రాక కోసం వరుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు రాత్రంతా వధువు ఇంటి దగ్గరే వేచి ఉన్నారు. అయినప్పటికి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతేకాక ఈ వివాహ ప్రతిపాదన తీసుకువచ్చిన మహిళను బందీంచారు. అయతే పెళ్లి తేదీకి ముందు వరకు కూడా వరుడు, అతడి కుటుంబ సభ్యులు అమ్మాయి ఇంటికి వెళ్లలేదని తెలిసింది. ఇక వివాహ ఏర్పాట్ల కోసం యువతి తన కుటుంబం నుంచి 20 వేల రూపాయలు తీసుకుందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. వివాహ ప్రతిపాదనను తీసుకువచ్చిన మహిళపై వరుడి కుటుంబం తీవ్రమైన ఆరోపణలు చేసిందని కొత్వాలి పోలీస్ స్టేషన్ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ షంషర్ యాదవ్ తెలిపారు. ఇరు వర్గాలు కాంప్రమైజ్‌ అయ్యి వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు.

 

మరిన్ని వార్తలు