పెళ్లి కొడుకును చెప్పుతో కొట్టిన తల్లి.. వైరల్‌ వీడియో..

8 Jul, 2021 15:57 IST|Sakshi

లక్నో: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. అయితే, ఈ వేడుకలలో ఏదో ఒక సంఘటనతో  ఆ వివాహం కాస్త వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటున్నాయి. తాజాగా, ఈ పెళ్లి కూడా ఒక సంఘటనతో ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివరాలు.. ఈ వివాహం యూపీలోని హమీర్‌ పూర్‌ జిల్లాలో జరిగింది. కాగా, భరువా సుమేర్‌ పూర్‌ గ్రామానికి చెందిన ఉమేష్‌ చంద్ర, అదే గ్రామానికి చెందిన అంకితాలు ఒకర్నొకరు ఇష్టపడ్డారు. వివాహంతో ఒక్కటవ్వాలనుకున్నారు.

ఉమేష్‌ తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే, ఈ పెళ్లికి ఇంట్లో వారు నిరాకరించారు. దీంతో ఉమేష్‌, అంకితలు ఇంట్లో నుంచి పారిపోయి రిజిస్ట్రర్‌ ఆఫీస్‌లో పెళ్లి చేసుకున్నారు. వారు వేరే చోట ఉంటున్నారు.  ఈ క్రమంలో కొన్ని రోజులకి అంకిత తల్లిదండ్రులు తమ కూతురు, అల్లుడి వివాహ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు, గ్రామస్థులందరిని ఆహ్వనించారు. కానీ.. ఉమేష్‌ కుటుంబం సభ్యులకు మాత్రం సమాచారం ఇవ్వలేదు. దీంతో వారు కోపంతో రగిలిపోయారు.

అప్పుడు, ఉమేష్‌ తల్లి రిసెప్షన్‌ వేడుకలో ముసుగు వేసుకుని వెళ్లింది. ఆ సమయంలో అక్కడ వందల సంఖ్యలో అతిథులున్నారు. రిసెప్షన్‌ పార్టీలో భాగంగా జైమాల కార్యక్రమం జరుగుతుంది. దీనిలో వేదికపై వధువరులు కూర్చోవటానికి కమలం పువ్వులాంటి సింహసనాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది చుట్టుతిరుగుతూ ఉంటుంది. అందరు ఆ కార్యక్రమాన్ని ఫన్నీగా చూస్తున్నారు. అప్పుడు, ముసుగులో ఉన్న వరుని తల్లి ఆ వేదికపై ఎక్కి.. వరుడిని చెప్పుతో కొట్టడం మొదలుపెట్టింది. ఈ అనుకొని సంఘటనతో.. పాపం.. దంపతులిద్దరు షాక్‌కు గురయ్యారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు కూడా ఆశ్చర్యపోయారు. అతిథులకు కూడా..  కాసేపు ఏంజరుగుతుందో అర్థం కాలేదు. కానీ, ఆ మహిళ, ముసుగు తీశాక అసలు సంగతి తెలిసింది. అయితే, ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియో చక్కర్లు కొడుతుంది. 

మరిన్ని వార్తలు