ప్రిన్సిపల్‌ అయితే నాకేంది? బడిలో అనుకోని అతిథి పెత్తనం

27 Jul, 2021 21:05 IST|Sakshi
ప్రిన్సిపల్‌ వచ్చినా కుర్చీపై లేవని వానరం (ఫొటో: News18Hindi

భోపాల్‌: మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణ కొంత శాంతించడంతో పలు రాష్ట్రాల్లో కొన్ని జాగ్రత్తలు, ఆంక్షల నడుమ విద్యాలయాలు తెరుచుకుంటున్నాయి. కొన్ని నెలల తర్వాత తెరుచుకోవడంతో పాఠశాలలు అధ్వానంగా మారాయి. కొన్నిచోట్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. వాటిని పాఠశాల సిబ్బందితో కలిసి విద్యార్థులు కూడా శుభ్రం చేశారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోనూ విద్యాలయాలు తెరుచుకున్నాయి. అయితే ఓ పాఠశాలలో తలుపులు తెరవగానే ప్రిన్సిపల్‌ భయపడ్డాడు. తన కుర్చీలో అనుకోని అతిథి ప్రత్యక్షమవడంతో ఖంగు తిన్నాడు.

మధ్యప్రదేశ్‌లో 11, 12వ తరగతులు కూడా సోమవారం (జూలై 26వ తేదీ) నుంచి ప్రారంభమయ్యాయి. గ్వాలియర్‌ జిల్లాలోని డబ్రాలో పాఠశాల తెరవగానే కోతులు ప్రత్యక్షమయ్యాయి. తరగతి గదుల్లో అవి విద్యార్థుల్లాగా కూర్చున్నాయి. నానా హంగామా చేశాయి. ఇక ప్రిన్సిపల్‌ తన గది తెరవగా అక్కడ కూడా వానరాలు బీభత్సం సృష్టించాయి. ప్రిన్సిపల్‌ కుర్చీలో కూర్చుని ప్రిన్సిపల్‌నే భయపెట్టాయి. విద్యార్థులు కూడా భయపడడంతో ప్రిన్సిపల్‌ ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు ధైర్యం చేసి వాటిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

>
మరిన్ని వార్తలు