GST Council meet: కీలక నిర్ణయాలు

12 Jun, 2021 15:49 IST|Sakshi

 కరోనా  మందులు, పరికరాలపై పన్ను ఊరట

వ్యాక్సిన్ల జీఎస్టీ రేటులో మార్పు లేదు

సాక్షి,ఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మందులు, వైద్య పరికరాలపై పన్నుల తగ్గించారు. కోవిడ్‌-19 చికిత్సకు ఉపయోగించే మూడు రకాల మందులకు పన్ను మినహాయింపునిచ్చారు. అయితే  కరోనా వ్యాక్సిన్లపై జీఎస్టీ రేటులో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్  వెల్లడించారు. 5 శాతం  జీఎస్టీ యధా విధిగా అమలవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈమినహాయింపులు  ఈ సంవత్సరం సెప్టెంబర్‌ 30 వరకు చెల్లుబాటులో ఉంటాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీంతో వ్యాక్లిన్లపై జీఎస్టీ వడ్డింపు నుంచి ఊరట లభిస్తుందని ఎదురు చూసిన వారికి  నిరాశే మిగిలింది.

ఆంబులెన్స్‌లపై విధించే జీఎస్టీని 12 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకు ఇది 28శాతంగా ఉంది.అలాగే ఎలక్ట్రిక్ ఫర్నేసులు,టెంపరేచర్‌ తనిఖీపరికరాలపై 5శాతం జీఎస్టీని వసూలు చేయనున్నారు.  దీంతోపాటు బ్లాక్‌ఫంగస్‌ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్‌-బీపై జీఎస్టీ మినహాయింపు నివ్వడం విశేషం. వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రులు, ఇతర ముఖ్య అధికారులతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో శనివారం జరిగిన భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్య నిర్ణయాలు 
వ్యాక్సిన్లపై  5 శాతం జీఎస్టీ అమలు
కోవిడ్ రిలీఫ్ మెటీరియల్‌పై సిఫారసులకు ఆమోదం 
టోసిలుజుమాబ్, యాంఫోటెరిసిన్  ఔషధాలపై పన్ను మినహాయింపు
రెమ్‌డెసివిర్‌పై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
మెడికల్‌ ఆక్సిజన్‌పై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
జనరేటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింపు
వెంటిలేటర్లపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింపు
సెప్టెంబర్‌ 30 వరకు కొనసాగనున్న సవరించిన జీఎస్టీ మినహాయింపులు

మరిన్ని వార్తలు