'జీఎస్టీ రుణాల్ని కేంద్రమే చెల్లిస్తుంది'

20 Sep, 2020 11:53 IST|Sakshi

న్యూఢిల్లీ: జీఎస్టీ రుణానికి సంబంధించి అసలు, వడ్డీ మొత్తం కేంద్రమే విడతలవారీగా చెల్లిస్తుంది అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ.. 'ఆయా రాష్ట్రాలు ఈ రుణాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కోవిడ్ వల్ల జరిగిన నష్టాన్ని కలుపుకుంటే మొత్తం లోటు రూ. 2,35,000 కోట్లుగా లెక్కించాం. ఈ మొత్తాన్ని రాష్ట్రాలు మార్కెట్ నుంచి రుణాల ద్వారా పొందడం రెండో ఆప్షన్. ఈ రుణం తిరిగి కేంద్రం చెల్లిస్తుంది. ఈ రుణాలపై వడ్డీని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. రాష్ట్రాలు ఈ రెండు విధానాల్లో ఏదైనా ఎంచుకోవచ్చు.  (కేంద్రమే అప్పు తీసుకోవాలి)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీఎస్టీ పరిహారం కింద చెల్లించాల్సిన మొత్తం రూ. 4,627 కోట్లు (ఏప్రిల్-జులై మధ్యకాలానికి) చెల్లించాలి. తెలంగాణ రాష్ట్రానికి రూ. 5,424 కోట్లు పరిహారం (ఏప్రిల్-జులై మధ్యకాలానికి) చెల్లించాలి. ఈ ఏడాది ఏప్రిల్- జులై మధ్యకాలానికి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించలేకపోయాం. జీఎస్టీ కంపెన్సేషన్ ఫండ్‌ ద్వారా రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తాం. లగ్జరీ వస్తువులపై వేసే సెస్ ద్వారా కంపెన్సేషన్ ఫండ్‌కి నిధులొస్తాయి. జీఎస్టీ కారణంగా నష్టపోతున్న రాష్ట్రాలకు ఆ నిధి నుంచి పరిహారం చెల్లిస్తాం. జీఎస్టీ చట్టం ప్రకారం కంపెన్సేషన్ ఫండ్ నుంచే రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలి.

2017-18 నుంచి 2019-20 వరకు క్రమం తప్పకుండా చెల్లించాం. ఈ ఏడాది కంపెన్సేషన్ ఫండ్‌లో తగినంత బ్యాలెన్స్ లేదు. అందువల్ల రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించలేకపోయాం. ఈ ఏడాది పరిహారం చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్రాలకు రెండు ఆప్షన్స్ ఇచ్చాం. 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై కూలంకుశంగా చర్చించాం. జీఎస్టీ అమలు ద్వారా రాష్ట్రాలు నష్టపోతున్న మొత్తం రూ. 97,000 కోట్లుగా లెక్కించాం. ఆ మొత్తాన్ని రాష్ట్రాలు కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ విండో ద్వారా రుణం రూపంలో పొందవచ్చు' అని వివరించారు. (రాష్ట్రాల కొంప ముంచిన ‘జీఎస్టీ’)

మరిన్ని వార్తలు