విషాదం: గతంలో కోవిడ్‌.. తాజాగా డెంగ్యూ.. బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి

12 Dec, 2021 20:54 IST|Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే ఆశాబెన్‌ పటేల్‌ (44) కన్నుమూశారు. డెంగ్యూతో బాధపడుతున్న ఆమె అహ్మదాబాద్‌లోని జైడస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస వదిలారు. గతంలో ఆమె కోవిడ్‌ బారినపడినట్టు తెలిసింది.  ఆమె మరణ వార్తను ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ వీఎన్‌ షా ధ్రువీకరించారు. 

2015లో ఆశాబెన్‌ పాటిదార్‌ రిజర్వేషన్ల అంశంపై పోరాడిన కీలక వ్యక్తుల్లో ఒకరు. ఆమె హార్దిక్‌ పటేల్‌కు సన్నిహితురాలు కూడా. 2017లో ఉంఝా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీచేసి ఆమె విజయం సాధించారు. ఆరుసార్లు బీజేపీ తరపున ఆ స్థానం నుంచి గెలిచి సత్తా చాటిన మాజీ మంత్రి నారాయణ్‌ పటేల్‌ని ఆమె ఆ ఎన్నికల్లో మట్టి కరిపించారు. 
(చదవండి: Transgender VRO: ఒక్క ఫోన్‌ కాల్‌.. హిజ్రా ద్రాక్షాయణికి ఉద్యోగం)

అయితే, పార్టీతో విభేదాలు రావడంతో 2019 ఆమె కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆశాబెన్‌ అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
(చదవండి: పసికందును రైలులో వదిలేసి.. ప్రియుడితో కలిసి)

మరిన్ని వార్తలు