మాజీ సీఎం కన్నుమూత

9 Jan, 2021 10:37 IST|Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి  మాధవ్‌ సిన్హ్‌ సోలంకి (94) కన్నుమూశారు. గాంధీనగర్‌లోని తన నివాసంలో శనివారం ఉదయం ఆయన మృతిచెందారు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఉన్న సోలంకి పార్టీలో ఎన్నో పదవులు అలంకరించారు. ఆయన మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహూల్‌ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. 

గుజరాత్‌ రాజకీయాల్లో చెరగని ముద్ర
న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 1976లో మాధవ్‌ సిన్హ్‌ కొంతకాలం ముఖ్యమంత్రిగా పని చేశారు. అనంతరం (క్షత్రియా, హరిజన, ఆదివాసీ, ముస్లిం) కూటమిని ఏర్పాటుచేసి 1980లో అధికారంలోకి వచ్చేలా చేశారు. 1981లో సీఎంగా ఎన్నికయ్యారు. సీఎంగా సోలంకి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 1985లో రాజీనామా చేసినప్పటికీ తర్వాత జరిగిన ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాలకు గాను 149 గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు. ఈ విధంగా ఆయన గుజరాత్‌ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. 

దేశం గొప్ప నాయకుడిని కోల్పోయింది. నూతన గుజరాత్‌ను రూపుదిద్దడంలో సోలంకి పాత్ర కీలకమని గుర్తుచేశారు. 
- రామ్‌నాథ్‌ కోవింద్‌, రాష్ట్రపతి 

దశాబ్దాలపాటు గుజరాత్ రాజకీయాల్లో మాధవ్‌ సిన్హ్‌ కీలక పాత్ర పోషించారని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. సోలంకి బలీయమైన నాయకుడని తెలిపారు. సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సోలంకి కుమారుడు భరత్‌తో మాట్లాడాను.
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఆయన మృతి దిగ్భ్రాంతి కలిగించింది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నాయకుడు, ప్రజలకు సామాజిక న్యాయం అందించారు.
- రాహూల్‌ గాంధీ

మరిన్ని వార్తలు