గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర ప్రమాణం.. మోదీ సహా కీలక నేతల హాజరు

12 Dec, 2022 10:19 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ 18వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత భూపేంద్ర పటేల్‌(60).. నేడు(సోమవారం) ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని కొత్త సెక్రటేరియట్‌ సమీపంలో ఉన్న హెలిప్యాడ్‌ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ గుజరాత్‌ 18వ సీఎంగా భూపేంద్రతో ప్రమాణం చేయించారు. సీఎంతోపాటు బీజేపీ నేతలు హర్ష సంఘవి, జగదీష్ విశ్వకర్మ గుజరాత్‌ కేబినేట్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌ షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, స్మృతి ఇరానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అదే సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి 200 మంది సాధువులకు ప్రత్యేక ఆహ్వానం అందించడం గమనార్హం.


ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 182 సీట్లకు గాను 156 స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేనంతగా 53 శాతం ఓటు బ్యాంక్‌ సాధించింది ఆ పార్టీ. కాగా కిందటి ఏడాది సెప్టెంబర్‌లో విజయ్‌ రూపానీని తప్పించి.. భూపేంద్రను సీఎంగా ఎపింక చేసింది గుజరాత్‌ బీజేపీ. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఘన విజయం సాధించారాయన. ఈ తరుణంలో.. నేడు వరుసగా రెండోసారి సోమవారం ప్రమాణం చేశారు. 

మరిన్ని వార్తలు