రికార్డు సృష్టించిన 62 ఏళ్ల మహిళ.. కోటి సంపాదన

11 Jan, 2021 08:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సాధించాలనే తపన ఉంటే, ఎన్ని అవరోధాలు ఎదురైనా లక్ష్యం సిద్ధిస్తుందనే మాటను నిజం చేసి చూపించింది గుజరాత్‌కు చెందిన 62 ఏళ్ల ఓ మహిళ. క్షీర విప్లవాన్ని సాధించడం అనేది మాటల్లోనే కాదు, చేతల్లోనూ ఆమె చేసి చూపిస్తోంది. గుజరాత్‌లో బనస్కాంత జిల్లాలోని నాగానా గ్రామానికి చెందిన నిరక్షరాస్యురాలు అయిన చౌదరి నవల్‌బెన్‌ దల్సంగ్‌బాయ్‌(62) ఏడాదిలో రూ. 1కోటి 10లక్షల విలువైన పాలను విక్రయించడం ద్వారా గుజరాత్‌లో కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ మహిళ వద్ద 80 గేదెలు, 45 ఆవులు ఉన్నాయి. వీటితో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కలిపి సుమారు వెయ్యి లీటర్ల పాలను ఆమె విక్రయిస్తోంది. రెండేళ్లలో నవల్‌బెన్‌కు బనస్కాంత జిల్లాలో 2 లక్ష్మి అవార్డులు, 3 ఉత్తమ పశుపాలక్‌ అవార్డులు లభించాయి. గాంధీనగర్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డులను అందుకున్నారు. నవల్‌బెన్‌ డెయిరీలో 11 మంది పని చేస్తున్నారు. క్షీర విప్లవానికి తోడ్పడుతున్న ఈ మహిళకు నలుగురు కుమారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు