కంగనా ఇంటి వద్ద కాల్పుల కలకలం

2 Aug, 2020 03:15 IST|Sakshi

తనని భయపెట్టేందుకేనని వ్యాఖ్య

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఇంటి వద్ద తుపాకీ కాల్పుల శబ్దం వినిపించడం కలకలం రేకెత్తించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలీలో కంగనా తన సొంతింట్లో ఉన్నపుడు శుక్రవారం రాత్రి పదకొండున్నరకు తుపాకీ చప్పుళ్ళు వినిపించడంతో పోలీసులకు సమాచార మిచ్చారు. దీంతో వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ కాల్పులకు కారణాలేమిటో తెలియరాలేదు. అయితే ఇటీవల సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య విషయంలో తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో, తనను భయపెట్టేందుకే ఇలా చేసి ఉంటారని కంగనా అభిప్రాయపడ్డారు.

ఇటువంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. కావాలనే కాల్పులు జరిపారనీ, తన గదికి ఎదురుగా ఉన్న సరిహద్దు గోడకి ఆవల ఎవరో ఉన్నట్లు అనిపించిందని ఆమె చెప్పారు. మరోవైపు, సుశాంత్‌æ ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ రియాచక్రవర్తిపై పట్నాలో నమోదైన కేసుని ముంబైకి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో రియాచక్రవర్తి దాఖలుచేసిన పిటిషన్‌ ఆగస్టు 5న విచారణకు రానుంది. పట్నాలో నమోదైన కేసు విచారణ కోసం బిహార్‌ పోలీసు బృందం ముంబైకి చేరుకుంది.

మరిన్ని వార్తలు