రూ .150 కే స్కానింగ్, రూ. 50 కే ఎంఆర్ఐ 

5 Oct, 2020 12:43 IST|Sakshi

పేదరోగులపై  గురుద్వారా బంగ్లా సాహిబ్ ఆసుపత్రి ఔదార్యం

తక్కువ ధరలతో అతి చౌక డయాగ్నొస్టిక్  సెంటర్‌

600 రూపాయలకే డయాలసిస్

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్  పేద రోగులకు ఊరట కల్పించనుంది. దేశంలోనే  అతి చౌక డయాగ్నొస్టిక్  సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.  తక్కువ ఖర్చుతో స్కానింగ్, ఎంఆర్ఐ లాంటి సదుపాయాలను  కల్పించనుంది. అలాగే కిడ్నీ రోగులకోసం త్వరలోనే ఒక డయాలసిస్  కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది  డిసెంబరు మాసంనుంచి తక్కువ ఖర్చుకే ఎంఆర్ఐ, స్కానింగ్ లాంటి సదుపాయాలను కల్పించనున్నామని మేదాంతా చైర్మన్, గురుహరికిషన్, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అరవిందర్ సింగ్ సోనీ వెల్లడించారు. అల్ట్రాసౌండ్ లేదా ఎక్స్‌రే కోసం 150 రూపాయలు, ఎంఆర్‌ఐ  కేవలం 50 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నామని తెలిపారు. తద్వారా అల్పాదాయ ఆదాయ వర్గాల ప్రజలకు సహాయపడాలని నిర్ణయించామన్నారు.  

అలాగే గురుద్వార ప్రాంగణంలో మూత్రపిండాల రోగుల కోసం  హరికిషన్ ఆసుపత్రిలో డయాలసిస్ చేస్తున్నట్లు సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ (డిఎస్‌జిఎంసి) మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఇది వచ్చే వారంనుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. డయాలసిస్ ప్రక్రియకు 600  రూపాయలు మాత్రమే చార్జ్ చేస్తామన్నారు. అవసరమైన ఇతర రోగులకు ఎంఆర్‌ఐ స్కాన్‌కు 800 రూపాయలు (ప్రైవేటు కేంద్రాల్లోఎంఆర్‌ఐకి ఖరీదు రూ.2,500) ధరకే అందించినున్నట్టు కూడా తెలిపారు. అయితే ఈ రాయితీ ఎవరికివ్వాలనే విషయాన్ని ఆసుపత్రి కమిటీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం 6 కోట్ల విలువైన డయాగ్నొస్టిక్ యంత్రాలను ఆసుపత్రికి విరాళంగా ఇచ్చామన్నారు. వీటిలో నాలుగు డయాలసిస్ మెషీన్స్, ఒక్కో అల్ట్రాసౌండ్, ఎక్స్-రే,ఎంఆర్‌ఐ యంత్రాలు చొప్పున  ఉన్నట్టు  ప్రకటించారు.

మరిన్ని వార్తలు